శశి థరూర్కు అమిత్ షా ఫోన్
ABN , First Publish Date - 2022-03-10T00:02:46+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పుట్టిన రోజు సందర్భంగా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆయన ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అయితే అమిత్ షా నుంచి ఫోన్ వస్తుందని థరూర్ ఊహించలేదు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు.
శశి థరూర్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ఆశ్చర్యం కలిగించినట్లు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫోన్ చేయడం తన మనసుకు హత్తుకుందని చెప్పారు. 66వ వసంతంలోకి అడుగుపెట్టడంలో ఓ ప్రత్యేకత ఉండాలన్నారు. ఆత్మీయంగా మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం శశి థరూర్కు ఓ లేఖ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గత జ్ఞాపకాలను నెమరు వేసుకునే ప్రత్యేక సందర్భం పుట్టిన రోజు అని తెలిపారు. అదే సమయంలో నూతనోత్తేజంతో మన కుటుంబం, సమాజం, దేశం పట్ల మన కర్తవ్యాలను నెరవేర్చడానికి ప్రేరణనిస్తుందన్నారు.