కోవిడ్ నియంత్రణ కోసం విధించిన నిబంధనల అమలు ఉపసంహరణ

ABN , First Publish Date - 2022-03-23T19:11:38+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర

కోవిడ్ నియంత్రణ కోసం విధించిన నిబంధనల అమలు ఉపసంహరణ

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విపత్తు నిర్వహణ చట్టం నిబంధనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించింది. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విధించిన నిబంధనల అమలు కొనసాగుతుంది. ముఖానికి మాస్క్ ధరించడం వంటి నిబంధనలు అమల్లో ఉంటాయి. 


కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ సన్నద్ధత, పరిస్థితిలో మొత్తం మీద కనిపిస్తున్న మెరుగుదల వంటివాటిని దృష్టిలో పెట్టుకుని విపత్తు నిర్వహణ చట్టం నిబంధనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉపసంహరించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా జారీ చేసిన ఆదేశాల్లో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు సూచనలు చేశారు. కోవిడ్ కట్టడి చర్యల కోసం విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం ఆదేశాలు, మార్గదర్శకాల జారీని తగిన విధంగా ఉపసంహరించడంపై పరిశీలించాలని తెలిపారు. ప్రస్తుత నిబంధనల అమలు మార్చి 31తో ముగుస్తుందని పేర్కొన్నారు.


కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, సలహాలను పాటించడం కొనసాగించవచ్చునని తెలిపారు. కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్, సంబంధిత ఇతర అంశాలపై సూచనలను అమలు చేయవచ్చునని పేర్కొన్నారు. 


ఇదిలావుండగా, మన దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య నిలకడగా తగ్గుతోంది. పాజిటివిటీ రేటు 0.5 శాతం కన్నా తక్కువగా ఉంది. అయితే యూరోపు, చైనా వంటి దేశాల్లో మళ్ళీ ఈ మహమ్మారి పెరుగుతుండటం కనిపిస్తోంది. బుధవారం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మన దేశంలో కొత్తగా 1,778 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 62 మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 23,000 ఉంది. 


Updated Date - 2022-03-23T19:11:38+05:30 IST