లఖింపూర్: SIT చార్జ్షీట్పై ప్రశ్నించిన జర్నలిస్ట్పై కేంద్ర మంత్రి బూతులు, దాడి
ABN , First Publish Date - 2021-12-15T22:00:21+05:30 IST
లఖింపూర్: SIT చార్జ్షీట్పై ప్రశ్నించిన జర్నలిస్ట్పై కేంద్ర మంత్రి బూతులు, దాడి
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై కారు ఎక్కడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా మొత్తం ఎనిమిది మరణించిన విషయం తెలిసిందే. అయితే అక్టోబర్ 3న ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం కోర్టు ముందు చార్జ్షీట్ సమర్పించింది. ఇందులో రైతులపైకి ఉద్దేశపూర్వకంగా కారు ఎక్కించారని ఇది కావాలని పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. ఇందులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. దీంతో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంతో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఆయనను ‘సిట్ చార్జ్షీట్’ గురించి ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సదరు జర్నలిస్టును దుర్భషలాడుతూ దాడికి సైతం పాల్పడ్డారు.
‘‘దిమాగ్ కరాబ్ హై క్యా బే’(మెదడు పాడైందా ఏమి), ‘మైక్ బంద్ కర్ బే’(మైక్ కట్టెయ్), ‘చోర్’ (దొంగలు)..’’ అంటూ బూతులు తిడుతూ ప్రశ్నించిన జర్నలిస్ట్ చేతిలో నుంచి మైక్ను లాగి బయటికి విసిరేరారు. రిపోర్టర్ ఏమీ చేయలేక అలా నిల్చునున్నాడు. అయినప్పటికీ అజయ్ మిశ్రా కోపం తగ్గలేదు. జర్నలిస్ట్ను బూతులు తిడుతూనే అతడిని పలుమార్లు వెనక్కి బలంగా తోశారు. అక్కడే ఉన్న పోలీసులు కేంద్ర మంత్రిని ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ మిశ్రా రాజీనామా చేయాలంటూ నినదిస్తున్నారు.