కమ్యూనిస్టులు ఏకం కావాలి
ABN , First Publish Date - 2021-01-25T05:25:01+05:30 IST
కమ్యూనిస్టులు ఏకం కావాలి
సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి
మానుకోటలో ప్రజాకవి జయరాజ్ తల్లి సంతాప సభ
మహబూబాబాద్ టౌన్, జనవరి 24 : ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరాలంటే కమ్యూనిస్టులంతా ఏకం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఆ దిశగా ఆలోచన చేయాలని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ పట్టణంలో ఆదివారం ‘మా తల్లుల చరిత్రలే ఈ దేశ చరిత్రలు’ అనే నినాదంతో నిర్వహించిన ప్రజాకవి జయరాజ్ తల్లి బోగిళ్ల అచ్చమ్మ సంస్మరణ సభలో నారాయణమూర్తి మాట్లాడారు.
కష్టాలు.. కన్నీళ్లను.. దిగమింగుకుని పిల్లలకు సంతోషాన్నిచ్చే తల్లిప్రేమ అత్యంత స్వచ్ఛమైనదని అన్నారు. అమ్మ, నాన్న, ప్రకృతిని ప్రేమిస్తూ జయరాజ్ అనేక పాటలు రాశారని, అమ్మను స్మరించుకుంటూ కొత్త సందేశాన్నిచ్చేలా సంతాపసభను నిర్వహించడం చరిత్రలో నిలిచిపోతుందని నారాయణమూర్తి కొనియాడారు. తన కలం, గళం ద్వారా అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిన జయరాజ్కు జ్ఞానపీఠ్ అవార్డును అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. శ్రామిక పీడితవర్గ సామాజిక ఉద్యమాల్లో తల్లుల పాత్ర కీలకమని, వారి త్యాగాలను చరిత్రలో లిఖించాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఒరవడికి శ్రీకారం చుట్టేలా అచ్చమ్మ సంస్మరణ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు.
సంతాపసభకు మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన కవులు, కళాకారులు, వివిధ పార్టీల నాయకులు హాజరై అచ్చమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అచ్చమ్మను స్మరిస్తూ కవి సారంగపాణి రూపొందించిన పాటను వినిపించారు. అరుణోదయ కళాకారుల పాటలు ఆలోచింపజేశాయి. సభలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, నేతలు, కవులు, కళాకారులు జి.రాములు, బొజ్జ భిక్షమయ్య, భాస్కరన్న, రాయల చంద్రశేఖర్, వసంతక్క, అరుణక్క, సూర్నపు సోమయ్య, నలమాస కృష్ణ, గౌని ఐలయ్య, పిల్లి సుధాకర్, స్కైలాబ్బాబు, కుర్ర మహేష్, అంబు, పాయం చిన్నచంద్రన్న, నాగన్న పాల్గొన్నారు.