UP Government: లాక్డౌన్ టైంలో వలస కూలీలు వదిలివెళ్లిన సైకిళ్లను యూపీ ప్రభుత్వం వేలం వేస్తే..
ABN , First Publish Date - 2022-06-07T02:17:29+05:30 IST
కోవిడ్ కారణంగా ప్రపంచం ఆగిపోయింది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ లాక్డౌన్ యూపీ ప్రభుత్వానికి..
కోవిడ్ కారణంగా ప్రపంచం ఆగిపోయింది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ లాక్డౌన్ యూపీ ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టింది. లాక్డౌన్ విధించిన సమయంలో వలస కూలీలు వదిలి వెళ్లిన సైకిళ్లను యూపీ ప్రభుత్వం వేలం వేసింది. మొత్తం 5 వేల 400 సైకిళ్లను వేలం వేయగా 21 లక్షల రూపాయల ఆదాయం లభించింది. లాక్ డౌన్ సమయంలో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది కాలినడకన, సైకిళ్లపై సొంతూళ్లకు వెళ్లారు.
సహరణ్పూర్లోని రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో అధికారులు తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. అనంతరం కొన్ని ప్రభుత్వాలు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేయడంతో యూపీలోని వలస కూలీలు సైకిళ్లను సహరణ్పూర్లో వదిలి వెళ్లారు. సైకిళ్లు వదిలి వెళ్లిన వారికి టోకెన్లు ఇచ్చారు. ఆ సమయంలో సుమారు 14 వేల 600 మంది కూలీలు సైకిళ్లు వదిలి వెళ్లారు. ఆ తర్వాత కొంత మంది తమ సైకిళ్లు తీసుకెళ్లగా మరికొంత మంది వదిలేశారు. దీంతో 5 వేల 400 సైకిళ్లను అధికారులు వేలం వేశారు. దీని ద్వారా ప్రభుత్వానికి 21 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.