కోవిడ్‌తో చనిపోయిన పోలింగ్ సిబ్బందికి రూ.30 లక్షలు: యూపీ ప్రభుత్వం నిర్ణయం

ABN , First Publish Date - 2021-07-17T06:48:35+05:30 IST

కరోనాతో చనిపోయిన పోలింగ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల..

కోవిడ్‌తో చనిపోయిన పోలింగ్ సిబ్బందికి రూ.30 లక్షలు: యూపీ ప్రభుత్వం నిర్ణయం

లక్నో: కరోనాతో చనిపోయిన పోలింగ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.30 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వహిస్తూ కోవిడ్ బారిన పడి చనిపోయిన 2వేల మంది సిబ్బంది కుటుంబాలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తామని, ప్రతి కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం అందిస్తామని యూపీ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అయితే పరిహారం కోసం ఇప్పటివరకు 3,078 దరఖాస్తులు వచ్చినట్లు ఓ అధికారి వెల్లడించారు.


మొత్తం 11 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ సిబ్బందిగా విధులు నిర్వహించారని, వారిలో 65 శాతం, అంటే 6.5 లక్షలకు పైగా ఉపాధ్యాయులేనని సదరు అధికారి వెల్లడించారు. దీనికోసం రూ.600 కోట్లు మంజూరయ్యాయని, అందులో రూ.300 కోట్లను పంచాయత్ రాజ్ విభాగం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు విడుదల చేసినట్లు వెల్లడించారు.


కాగా.. అంతకుముందు ప్రభుత్వం మాత్రం.. ఎన్నికల విధులు నిర్వహిస్తూ కేవలం 74 మంది పోలింగ్ సిబ్బంది మాత్రమే కరోనా కారణంగా మరణించారని, అందులో ముగ్గురు మాత్రమే టీచర్లని పేర్కొంది. అయితే ఉత్తర ప్రదేశ్ ప్రాథమిక శిక్షక్ సంఘ్ మాత్రం.. ఏప్రిల్ 15 నుంచి మే 5వ తేదీ మధ్య కాలంలో పంచాయత్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన దాదాపు 1,621 మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారని ఓ నివేదికను విడుదల చేసింది.

Updated Date - 2021-07-17T06:48:35+05:30 IST