Uttar Pradesh రాష్ట్రంలో మహిళల కోసం షెల్టర్లు
ABN , First Publish Date - 2022-06-22T13:05:08+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది...
లక్నో (ఉత్తరప్రదేశ్):ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళా వసతి గృహాల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఘాజీపూర్, మొరాదాబాద్, ఘజియాబాద్ జిల్లాల్లో రూ.20.21 కోట్లతో ఒక్కొక్కటి 100 పడకల సామర్థ్యంతో కొత్త మహిళా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఆగ్రా నగరంలో 50 పడకల సామర్థ్యంతో బాలల వసతిగృహాన్ని కూడా ప్రభుత్వం నిర్మించనుంది రాయ్బరేలి, కాన్పూర్, మీర్జాపూర్, చిత్రకూట్లలో ఒక్కొక్కటి 100 పడకల సామర్థ్యంతో రాష్ట్ర పరిశీలన గృహాలు కూడా నిర్మించనున్నారు.
కొత్త బాలల గృహాలు, మహిళా వసతి గృహాలు నిర్మించాలని స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా, దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రాష్ట్రంలో కొత్త బాలల సముదాయాలు, మహిళా వసతి గృహాలు, ప్రభుత్వ అబ్జర్వేషన్ హోమ్ల నిర్మాణం ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మహిళా శిశు శాఖ డిప్యూటీ డైరెక్టర్ బ్రిజేంద్ర సింగ్ నిరంజన్ చెప్పారు.అనాథ పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని స్వావలంబన దిశగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందని నిరంజన్ పేర్కొన్నారు.