Uttar Pradesh: దోషిత్వం నిర్థరణ కావడంతో కోర్టు నుంచి పారిపోయిన మంత్రి!

ABN , First Publish Date - 2022-08-08T00:04:55+05:30 IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని

Uttar Pradesh: దోషిత్వం నిర్థరణ కావడంతో కోర్టు నుంచి పారిపోయిన మంత్రి!

లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి రాకేష్ సచన్ (Rakesh Sachan) ఓ కేసులో దోషి అని కాన్పూరు కోర్టు శనివారం నిర్థరించింది. ఆయనకు విధించే శిక్షను ప్రకటించడానికి ముందే ఆయన అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే ఆయన ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 


రాకేశ్ గతంలో కాంగ్రెస్‌ నేత (Congress Leader). ఇటీవలి ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ (BJP)లో చేరి, మంత్రి పదవి దక్కించుకున్నారు. చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు, ఖాదీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చట్ట విరుద్ధంగా ఓ ఆయుధాన్ని కలిగియున్నట్లు రాకేశ్‌పై 1991లో కేసు నమోదైంది. ఆయన దోషి అని శనివారం కాన్పూరు కోర్టు నిర్థరించింది. ఆయనకు శిక్ష విధించడానికి ముందు ఆయన అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 


సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సహా ప్రతిపక్ష నేతలు స్పందిస్తూ, కోర్టు నుంచి రాకేశ్‌ను కస్టడీకి తీసుకోవడానికి ముందు పారిపోయారని ఆరోపించారు. విధించదగిన శిక్షపై వాదనలు ప్రారంభమవడానికి ముందు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారని ఆరోపించారు. 


కాన్పూరు (Kanpur) సీనియర్ పోలీసు అధికారి ఏపీ తివారీ స్పందిస్తూ, రాకేశ్ కోర్టు నుంచి పారిపోయినట్లు కోర్టు అధికారులు తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. దీనిని తాము పరిశీలిస్తామని చెప్పారు. సంబంధితులందరితోనూ సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


ఇదిలావుండగా, రాకేశ్ ఇచ్చిన ట్వీట్‌లో తాను పొరుగు జిల్లాలో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నానని చెప్తూ, దానికి సంబంధించిన ఫొటోను జత చేశారు. తనపై ఆరోపణలు పూర్తిగా తప్పు అని, రాజకీయ ప్రేరేపితమని తెలిపారు. తన జీవితంలో తాను ఎన్నడూ పారిపోలేదన్నారు. తనకు వ్యతిరేకంగా నమోదైనవన్నీ నిరాధారమైన కేసులని చెప్పారు. తాను ఉదయం 11 గంటలకన్నా ముందే కోర్టుకు వెళ్ళానని, తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నందువల్ల విచారణను వేగవంతం చేయాలని కోరానని చెప్పారు. కొంత సమయం పడుతుందని న్యాయవాది చెప్పడంతో హాజరు మినహాయింపు దరఖాస్తు చేయాలని కోరానని, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పారు. తాను ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. అనంతరం మరికొన్ని కార్యక్రమాలకు కూడా హాజరయ్యానన్నారు. కోర్టులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాలని కోరారు. తాను కోర్టుకు వెళ్లి, తన వాదనను న్యాయవాదుల ద్వారా వినిపిస్తానని చెప్పారు. 


Updated Date - 2022-08-08T00:04:55+05:30 IST