కట్నం తీసుకోనట్టు సర్టిఫికెట్ ఉండాల్సిందే: ప్రభుత్వ అధికారులకు ఆదేశం
ABN , First Publish Date - 2021-10-18T03:25:58+05:30 IST
వరకట్న నిరోధక చట్టాన్ని మరింత బలపర్చేందుకు ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంతా కట్నం తీసుకోనట్టు అఫిడవిట్ సమర్పించాలని సర్క్యూలర్లో పేర్కొన్నారు..
లఖ్నవూ: వరకట్న నిరోధక చట్టాన్ని మరింత బలపర్చేందుకు ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ తాజాగా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు అంతా కట్నం తీసుకోనట్టు అఫిడవిట్ సమర్పించాలని సర్క్యూలర్లో పేర్కొన్నారు. 2004, ఏప్రిల్ 31 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ అక్టోబర్ 12 సర్క్యూలర్ ప్రకారం అక్టోబర్ 18లోపు వరకట్నం తీసుకోనట్టు అఫిడవిట్ సమర్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎవరైనా వరకట్నం తీసుకున్నట్లు తెలిస్తే తగిన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లు పేర్కొంది.
ఈ విషయమై ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మనోజ్ రాయ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో వరకట్న నిరోధక చట్టం అమలులో ఉంది. ఆ నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వరకట్నం తీసుకోలేదని ధ్రువీకరిస్తూ అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించాం. వరకట్న నిరోధక చట్టం అమలుపై ఒక నివేదిక వస్తుంది. దాన్ని ప్రభుత్వానికి అందిస్తాం’’ అని పర్కొన్నారు.