ప్రజా సంఘాల నేతలను విడుదల చేయాలి
ABN , First Publish Date - 2021-01-22T06:00:05+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన ప్రజా సంఘాల నేతలను భేషరతుగా విడుదల చేయాలని ఉపా రద్దు పోరాట కమిటీ భాగస్వామ్య సంస్థల నాయకులు డిమాండ్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం వద్ద ఉపా రద్దు కమిటీ నిరసన
గుంటూరు, జనవరి 21: రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన ప్రజా సంఘాల నేతలను భేషరతుగా విడుదల చేయాలని ఉపా రద్దు పోరాట కమిటీ భాగస్వామ్య సంస్థల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం గుంటూరులోని లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల ఏపీలో హక్కుల, ప్రజా సంఘాల నాయకులు, బాధ్యులను బ్రిటీషు హయాంలోని రౌలత్ చట్టం కంటే క్రూరమైన ఉపా చట్టం కింద అరెస్టు చేశారన్నారు. తక్షణం ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, ఆ చట్టం కింద అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని 23న గుంటూరులోని సీపీఎం కార్యాలయంలో జరిగే బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షుడు విజయకుమార్, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు, పీకేఎస్ నాయకులు ఎన్ పోతురాజు, సుధాకర్, ఏఈఎల్సీ ఆస్తుల పరిరక్షణ కమిటీ నాయకులు సీహెచ్ దేవరాజ్, బత్తుల వీరాస్వామి, విల్సన్ బాబు, నాగేశ్వరరావు, విరసం, సీఎంఎస్, సీఆర్పీపీ, అమరుల బంధు మిత్రుల కమిటీ, భీమ్సేవాదళ్, అంబేద్కర్ యువజన సంఘం, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.