మంత్రి పేర్నిపై హత్యాయత్నంకు సంబంధించి తాజా అప్డేట్

ABN , First Publish Date - 2020-12-02T16:55:11+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన ఘటన

మంత్రి పేర్నిపై హత్యాయత్నంకు సంబంధించి తాజా అప్డేట్

అమరావతి : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిన ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ఇప్పటికే మంత్రి అనుచరులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ హత్యాయత్నంపై చిత్రవిచిత్రాలుగా వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 


ఉదయం నుంచే..

నానిపై జరిగిన హత్యాయత్నంకు సంబంధించి నిందితుడు రెక్కీ నిర్వహించిన మరికొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు ఉదయం నుంచి నిందితుడు మంత్రి చుట్టూనే తిరుగుతూ రెక్కీ నిర్వహించినట్టుగా ఈ ఫోటోలు అద్దం పడుతున్నాయి. ఈ ఫోటోలనే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టి టీడీపీపై నిందారోపణలు చేస్తున్నారు. ఈ ఫొటోల వ్యవహారంపై ఇంతవరకూ పోలీసులు స్పందించలేదు.


అసలేం జరిగింది..!?

మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి పేర్ని నాని అనుచరులు నిందితుడిని పట్టుకోవడం ప్రమాదం తప్పింది. మంత్రిని కలవడానికి అని వచ్చిన ఓ వ్యక్తి ఆయన కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేశారు. దండం పెడుతూ ఒక్కసారిగా తాపీని తీసి మంత్రిపై దాడికి యత్నించాడు. అయితే అనుచరులు వెంటనే అడ్డుకోవడంతో మంత్రి పేర్ని నాని సురక్షితంగా బయటపడ్డారు. నిందితుడిని పట్టుకున్న మంత్రి అనుచరులు అతడిని పోలీసులకు అప్పగించారు. దాడి చేసిన వ్యక్తి తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. మంత్రి నివాసంలోనే దాడి జరగడం సంచలనం సృష్టిస్తోంది.


మంత్రి ఏమన్నారంటే..

మా తల్లిగారి పెద్దకర్మ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాం. పూజలన్నీ పూర్తి చేసుకుని భోజనాల దగ్గరకు వెళ్తున్నా. మా ఇంటివద్దకు ప్రజలు చాలామంది వచ్చారు. వారందరినీ పలకరిస్తూ గేటు దగ్గరకు వచ్చా. అక్కడ ఒకతను తల వంచుకుని కాళ్లకు దండం పెట్టడానికి వస్తున్నట్లుగా ముందుకు వచ్చాడు. దగ్గరకు వచ్చాక చూస్తే.. ఐరన్‌ది ఏదో పొట్టలో నుంచి తీసి పొడవడానికి ప్రయత్నించాడు. అయితే మొదటి సారి విఫలం అవడంతో రెండో సారి పొడవడానికి ప్రయత్నిస్తుంటే నా చుట్టూ ఉన్నవాళ్లు వచ్చి పట్టుకున్నారు. అతను ఎందుకిలా చేశాడో నాకు తెలీదు. నేనైతే సురక్షితంగా ఉన్నా. అతను బలరాం పేటకు సంబంధించిన వ్యక్తి. నేను గుర్తు పట్టాను. గన్‌మెన్లు అతడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. నాకు ఏమీ కాలేదు. ఎవరూ ఆందోళన చెందవద్దుఅని మంత్రి పేర్ని నాని తెలిపారు.

Updated Date - 2020-12-02T16:55:11+05:30 IST