UPI: బ్రిటన్ వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్..!

ABN , First Publish Date - 2022-08-19T21:54:55+05:30 IST

UPI expands further globally; Indian travellers to U.K. to enjoy hassle-free digital transactions

UPI: బ్రిటన్ వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్..!

ఎన్నారై డెస్క్: భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియల్ టైం చెల్లింపుల వ్యవస్థ ‘యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (United payments interface) త్వరలో బ్రిటన్‌లోనూ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ-UPI) రూపకర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCL) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.  చెల్లింపుల సంస్థ పేఎక్స్‌పర్ట్(PayXpert) సహకారంతో బ్రిటన్‌లోనూ యూపీఐ సేవలు త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఇది బ్రిటన్‌లోని భారతీయ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరమని వ్యాఖ్యనించింది. 


ఈ వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎన్‌పీసీఎల్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NPCI International Payments Ltd) పేఎక్స్‌పర్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘‘ఈ ఒప్పందం ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత భారతీయ చెల్లింపుల విధానం.. బ్రిటన్‌లోనూ అందుబాటులోకి వస్తుంది’’ అని ఎన్‌పీసీఎల్ తెలిపింది. బ్రిటన్‌లో యూపీఐ అందుబాటులోకి వస్తే తమకు కొత్త వ్యాపారావకాశాలు లభిస్తాయని పేఎక్స్‌పర్ట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేర్కొన్నారు. బ్రిటన్ వ్యాపారులకు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలుగుతామని ఆయన తెలిపారు. 


ప్రపంచంలో అత్యంత విజయవంతమైన రియల్ టైం చెల్లింపుల వ్యవస్థల్లో ఒకటిగా యూపీఐ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. 2021లో భారత్‌లో యూపీఐ లావాదేవీల మొత్తం విలువ 940 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశ జీడీపీలో ఇది దాదాపు మూడో వంతుకు సమానం. ఇక దేశీయంగా అభివృద్ధి చేసిన కార్డు ఆధారిత చెల్లింపు వేదిక.. రూపే (Rupay) కూడా ప్రజాదరణ పొందుతోంది. ఇప్పటివరకూ దేశంలో 70 కోట్ల పైగా రూపే కార్డులు జారీ అయ్యాయి. 


యూపీఐతో బ్రిటన్‌లోని భారతీయ పర్యాటకులకూ ప్రయోజనం కలుగుతుంది. తమకు చిరపరిచితమైన క్యూఆర్ కోడ్ ఆధారంగా వారు అత్యంత సులువుగా డబ్బులు చెల్లించగలుగుతారు. ఎన్‌పీసీఐ ప్రకటన ప్రకారం.. ఏటా 5 లక్షల మందికి పైగా భారతీయులు బ్రిటన్‌కు వెళుతుంటారు. వీరిలో విద్యార్థుల సంఖ్య లక్షపైనే ఉంటుంది. ఈ సంఖ్య భవిష్యత్తులో అనేక రెట్లు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పేఎక్స్‌పర్ట్ సంస్థతో తమ భాగస్వామ్యం ఓ మైలురాయి అని ఎన్‌పీసీఎల్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ సంస్థ.. ఇంటర్నేషనల్ బిజినెస్ డిపార్ట్‌మెంట్ అధిపతి అనుభవ్ శర్మ వ్యాఖ్యానించారు. 


యూపీఐకి ఆమోదం తెలిపిన తొలి దేశం భూటాన్ అన్న విషయం తెలిసిందే. గతేడాది జూలైలో అక్కడి ప్రభుత్వం ఈ చెల్లింపుల వ్యవస్థను దేశంలోకి అనుమతించింది. దీనితో పాటూ రూపే కార్డులకూ ఆమెదం తెలిపింది. ఇప్పటివరకూ రూపే కార్డులను అనుమతించిన ఏకైక దేశం భూటాన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేపాల్ కూడా యూపీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.



Updated Date - 2022-08-19T21:54:55+05:30 IST