Uttar Pradesh బుందేల్ఖండ్ ప్రాంతంలో రికార్డు ఉష్ణోగ్రత...49 డిగ్రీల సెల్సియస్
ABN , First Publish Date - 2022-05-16T12:54:44+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని బండా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది....
బుందేల్ఖండ్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని బండా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత 28 ఏళ్లలో మొట్టమొదటిసారి 49 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో రికార్డు నమోదైంది. 1994వసంవత్సరం మే 31వతేదీన బండా జిల్లాలో 48.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ఈ ఏడాది మే 15వతేదీన ఆ రికార్డును బద్దలు కొట్టింది. వేడిగాలులు వీయడంతో ప్రజలు అల్లాడిపోయారు.ఆగ్రాలో ఆదివారం నాడు 47.7 డిగ్రీల సెల్సియస్, ఝాన్సీ జిల్లాలో 47.6 డిగ్రీలు, ప్రయాగ్రాజ్లో 46.9, కాన్పూర్లో 46.1, వారణాసిలో 46, చుర్క్లో 45.6, హమీర్పూర్లో, ఫతేపూర్లో 45. 2, ఒరాయ్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర రాజధాని లక్నోలో గరిష్ఠ ఉష్ణోగ్రత 41. 3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.రానున్న 48 గంటల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.తూర్పు ఉత్తరప్రదేశ్లోని చోట్ల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.