ఏపీలో రైతన్నకి యూరియా కష్టాలు

ABN , First Publish Date - 2021-08-13T17:41:40+05:30 IST

ఏపీలో రైతన్నకు యూరియా కష్టాలొచ్చాయి. నష్టం పేరుతో అమ్మకాలపై డీలర్లు విముఖత చూపుతున్నారు.

ఏపీలో రైతన్నకి యూరియా కష్టాలు

అమరావతి: ఏపీలో రైతన్నకు యూరియా కష్టాలొచ్చాయి. నష్టం పేరుతో అమ్మకాలపై డీలర్లు విముఖత చూపుతున్నారు. రవాణా భారమే అసలు సమస్యగా మారింది. ఆర్బీకేల్లో యూరియా దొరుకుతున్నా పెట్టుబడి భారంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి కొరత లేకపోయినా ఏపీ రైతులకు యూరియా అందే పరిస్థితి కనిపించడంలేదు. గరిష్ఠ ధరకు అమ్మినా లాభం మాట దేవుడెరుగు. రూ. 46 నష్టం వస్తుందంటూ వ్యాపారులు అమ్మకాలపై విముఖత ప్రదర్శిస్తున్నారు. 


ఎరువుల అమ్మకాలు రైతు భరోసా కేంద్రాల్లో సాగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే పెట్టుబడి భారం రీత్యా చిన్న, సన్నకారు రైతు ఆర్బీకేలకు వెళ్లడానికి సిద్ధంగా లేరు. దీంతో ఈ సీజన్‌లో సాగులో ఉన్న 50 లక్షల ఎకరాలకు యూరియా కొరత ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు యూరియాపై కేంద్రం సబ్సిడీ ఇచ్చేది. దానిని ఎత్తివేయడంతో యూరియా రవాణా భారాన్ని కంపెనీలు రిటైల్ వ్యాపారులపై వేశాయి. పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరల నేపథ్యంలో ఈ భారం 45 కిలోల బస్తాకు రూ. 61 ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బస్తా కనిష్ఠ చిల్లర ధర రూ. 266.50 పైసలకు అమ్మితే డీలర్‌కు రూ. 15 మిగులుతుంది. అయితే రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో లాభం కాస్త పోయి బస్తాకు రూ. 46 నష్టం వస్తుందని వారు వాపోతున్నారు.

Updated Date - 2021-08-13T17:41:40+05:30 IST