భారత్కు సాయం చేయడం అమెరికా నైతిక బాధ్యత: కాంగ్రెస్ సభ్యురాలు జయపాల్
ABN , First Publish Date - 2021-05-08T00:01:21+05:30 IST
కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి సాయం చేయాల్సిన ‘నైతిక బాధ్యత’ అమెరికాకు ఉందని
వాషింగ్టన్: కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి సాయం చేయాల్సిన ‘నైతిక బాధ్యత’ అమెరికాకు ఉందని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. భారత్లో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయని, ప్రతి రోజూ లక్షలాది కేసులు వెలుగు చూస్తున్నాయని ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ఆసుపత్రులలో పడకలు లేవని, రోగులకు సరిపడా ఆక్సిజన్ అందడం లేదని విచారం వ్యక్తం చేశారు. వైద్యుడిని సంప్రదించేలోపే రోగులు ప్రాణాలు విడిచిపెడుతున్నారని అన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జయపాల్ తొలి ఇండియన్ అమెరికన్ కావడం గమనార్హం.
‘‘ఇండియాకు మన సాయం కావాలి. ఆ దేశానికి సాయం చేయడం మన నైతిక బాధ్యత కూడా. ప్రపంచ మహమ్మారిని ఓడించేందుకు అంతర్జాతీయ స్థాయి స్పందన అవసరం’’ అని జయపాల్ అన్నారు. కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరిన తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు జయపాల్ ఇటీవల భారత్ వచ్చారు. ప్రతినిధుల సభలోని శక్తిమంతమైన ప్రోగ్రెసివ్ కాకస్ చైర్విమెన్ అయిన జయపాల్ అమెరికాలో భారత రాయబారి తరణ్జీత్ సింగ్ సంధుతో జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీకా ముడి సరుకు కోసం భారత్ చేస్తున్న అభ్యర్థనను అంగీకరించాల్సిందిగా బైడన్ను పలుమార్లు కోరినట్టు చెప్పారు. తన పిలుపునకు బైడెన్ యంత్రాంగం స్పందించిందని జయపాల్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లలో 80 శాతం ధనిక దేశాల వద్ద ఉంటే పేద దేశాల వద్ద 0.3 శాతం మాత్రమే ఉన్నాయని వివరించారు. ఈ అన్యాయాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెషనల్ ప్రోగ్రెసివ్ కాకస్ దృష్టిసారించిందని, ఆయా దేశాల రాయబారులు, బహుపాక్షిక సంస్థలతోపాటు బైడెన్ యంత్రాంగంతో చర్చిస్తున్నట్టు జయపాల్ వివరించారు.