అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ సమీపంలో కాల్పుల కలకలం
ABN , First Publish Date - 2021-08-04T04:44:24+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఈ సారి ఏకంగా అగ్రరాజ్య రక్షణ కేంద్రం సమీపంలో..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకుల మోత మోగింది. ఈ సారి ఏకంగా అగ్రరాజ్య రక్షణ కేంద్రం సమీపంలో ఈ కాల్పులు జరగడం సంచలనంగా మారింది. మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్కు కూతవేటు దూరంలోని మెట్రో రైల్వే స్టేషన్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా కాలమాన ప్రకారం.. గురువారం ఉదయం కాల్పులు చోటుచేసుకున్నాయి. మెట్రో స్టేషన్లో వరుస కాల్పులు వినబడగానే పెంటగాన్ కార్యాలయాన్ని హుటాహుటిన లాక్ డౌన్ చేశారు. తుపాకీతో మెట్రో స్టేషన్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో మెట్రో స్టేషన్లో రక్తపుటేర్లు పారాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
పెంటగాన్ ట్రాన్సిట్ సెంటర్లో వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన కారణంగా పెంటగాన్ను లాక్డౌన్ చేసినట్లు అధికారులు వెల్లడించారుు. ఈ మేరకు పెంటగాన్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రజలకు ప్రత్యేక సందేశం అందించింది. ‘పెంటగాన్ లాక్డౌన్లో ఉంది. సాధారణ అటువైపుగా రావద్దు’ అంటూ ఆ ట్వీట్లో పేర్కొంది. అంతేకాకుండా ఆర్లింగ్టన్ సబర్బన్ పరిథిలో విధులు నిర్వర్తించాలని డిఫెన్స్ ఉద్యోగులను పెంటగాన్ ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా.. మొత్తం ఎంతమంది మరణించారు..? ఎంత మందికి తీవ్రగాయాలయ్యాయి..? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.