యూఎస్లో కొవిడ్ విలయం.. 24 గంటల్లో 2వేలకు పైగా మరణాలు
ABN , First Publish Date - 2020-11-25T20:13:15+05:30 IST
అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది.
వాషింగ్టన్: అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 2వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒకేరోజు కొవిడ్ వల్ల 2,146 మంది మృతి చెందినట్టు జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ పేర్కొంది. మే నెలలో చివరిసారిగా రెండు వేలకు పైగా మరణాలు నమోదు కాగా.. ఆరు నెలల తర్వాత మంగళవారం మరోసారి 2వేలకు పైగా కరోనా మరణాలు సంభవించినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. నిన్న సంభవించిన మరణాలతో కలిపి ఇప్పటివరకు యూఎస్ వ్యాప్తంగా ఈ వైరస్కు బలైనవారి సంఖ్య 2,59,925కు చేరింది.
కాగా, దేశంలో మహమ్మారి ప్రభావం మొదలైన తర్వాత ఒకేరోజు 2వేలకు పైగా కొవిడ్ మరణాలు నమోదు కావడం ఇది 21వ సారి. అలాగే మంగళవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 1,72,935 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మహమ్మారి సోకిన వారి సంఖ్య 1,25,91,163కు చేరింది. ఇక ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.