థ్యాంక్స్ గివింగ్ కారణంగా అమెరికాలో విపరీతంగా పెరుగుతున్న కేసులు, మరణాలు
ABN , First Publish Date - 2020-11-27T09:32:47+05:30 IST
అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి ఎయిర్పోర్టులు నిండిపోయాయి. దీని వల్ల అమెరికాలో ఒక్కసారిగా
వాషింగ్టన్: అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా గత కొద్ది రోజుల నుంచి ఎయిర్పోర్టులు నిండిపోయాయి. దీని వల్ల అమెరికాలో ఒక్కసారిగా కరోనా కేసులు, మరణాలు పెరిగిపోయాయి. లక్షలోపు ఉండే కేసులు ఇప్పుడు లక్షన్నర నుంచి రెండు లక్షలు దాటేస్తున్నాయి. బుధవారం అమెరికాలో దాదాపు రెండు లక్షల కేసులు నమోదయ్యాయి. మరోపక్క ఒకేరోజు కరోనా కారణంగా 2,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గడిచిన ఆరు నెలల్లో ఒకే రోజు ఇంతమంది మరణించడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. అమెరికాలో ఏ ఎయిర్పోర్టులో చూసినా కిక్కిరిసిన జనాలు కనపడుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. థ్యాంక్స్ గివింగ్ను కుదిరినంత వరకు వర్చువల్గా జరుపుకోవాలని అధికారులు సూచిస్తూ వచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు మొత్తం 1,32,23,102 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 2,69,326 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ వైరస్పై 95 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుండటంతో త్వరలోనే ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని ఆశిస్తున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఈ వ్యాక్సిన్ ఎఫ్డీఏ అప్రూవల్కు వెళ్లనుంది. ఎఫ్డీఏ అప్రూవల్ లభిస్తే.. డిసెంబర్ నెలలోనే నాలుగు కోట్ల మంది అమెరికన్లకు అమెరికా ప్రభుత్వం వ్యాక్సిన్ వేయాలని భావిస్తోంది.