భారత్కు అందించే సాయాన్ని వేగంతం చేయండి.. బైడెన్ ప్రభుత్వాన్ని కోరిన సెనేటర్లు
ABN , First Publish Date - 2021-05-07T05:38:01+05:30 IST
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్కు అందించే సహాయాన్ని వేగవంతం చేయాలని ముగ్గురు అమెరికన్ సెనేటర్లు బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
వాషింగ్టన్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్కు అందించే సహాయాన్ని వేగవంతం చేయాలని ముగ్గురు అమెరికన్ సెనేటర్లు బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇండియాలో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కష్టకాలంలో బైడెన్ ప్రభుత్వం భారత్కు అందిస్తున్న సాయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా సెకండ్ భారత్లో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు కొవిడ్ బారినపడుతుండగా.. వేలాది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో అగ్రరాజ్యం అమెరికా ఇండియాకు అండగా నిలిచింది. వైద్య పరికరాలు, ఔషధాలను భారత్కు సరఫరా చేస్తోంది.
కాగా.. బైడెన్ ప్రభుత్వం ఇండియాకు అందిస్తున్న సహాయంపట్ల హర్షం వ్యక్తం చేసిన యూఎస్ సెనేటర్లు మార్క్ వార్నర్, జాన్ కార్నిన్, రాన్ పోర్మ్టన్.. సాయాన్ని మరింత వేగవంతం చేయాలని లేఖ ద్వారా కోరారు. ‘భారత్లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. భారత దేశంలో ప్రస్తుతం ఉన్న వైద్య వ్యవస్థ, మౌలిక సదుపాయాలు కరోనా ఉధృతికి ఎదుర్కొలేపోతున్నాయన్న విషయం మీకు కూడా తెలుసు. అందువల్ల రక్షణశాఖతోపాటు ఇతర యూఎస్ ప్రభుత్వ సంస్థలను అంతర్జాతీయ, ప్రైవేటు రంగ భాగస్వాములత కలిసి పని చేయడం ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ వైద్య పరికరాలను భారత్కు వీలైనంత త్వరగా తరలించండి. అంతేకాకుండా అమెరికా అవసరాలకు మించి ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లను ఇండియాకు అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించండి’ అని అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి టోనీ బ్లింకెన్కు రాసిన లేఖలో అమెరికన్ సెనేటర్లు పేర్కొన్నారు.