సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి కరంట్ కనెక్షన్ కట్

ABN , First Publish Date - 2022-04-15T22:23:41+05:30 IST

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ల గర్జన ఏ

సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి కరంట్ కనెక్షన్ కట్

లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ల గర్జన ఏ మాత్రం తగ్గడం లేదు. రాజకీయ దిగ్గజాలను సైతం వదిలిపెట్టకుండా దూసుకెళ్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్‌కు బరేలీలో ఉన్న చట్టవిరుద్ధ పెట్రోలు బంకుపై కొద్ది రోజుల క్రితం విరుచుకుపడ్డాయి. తాజాగా బరేలీలోని ఆ పార్టీ కార్యాలయానికి కరంట్ కనెక్షన్‌ను కట్ చేశాయి. 


ఉత్తర ప్రదేశ్ విద్యుత్తు శాఖ అధికారులు మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం కరంట్ బిల్లును ఐదేళ్ళ నుంచి చెల్లించలేదని తెలిపారు. రూ.1.15 లక్షల మేరకు బాకీ పడటంతో విద్యుత్తు కనెక్షన్‌ను కట్ చేసినట్లు తెలిపారు. ఎస్‌డీవో గౌరవ్ శర్మ మాట్లాడుతూ, ఈ బిల్లును చెల్లించాలని సమాజ్‌వాదీ పార్టీ నేతలను చాలా సార్లు కోరినట్లు చెప్పారు. వారు బిల్లును చెల్లించకపోవడంతో విద్యుత్తు కనెక్షన్‌ను తొలగించినట్లు తెలిపారు. ఈ కనెక్షన్ వీర్ పాల్ సింగ్ యాదవ్ పేరు మీద ఉందని, ఆయన ప్రస్తుతం ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని చెప్పారు. 


వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. విద్యుత్తు బిల్లులను చెల్లించకుండా తప్పించుకుంటున్నవారి నుంచి సొమ్మును రాబట్టేందుకు ఇదే సరైన సమయమని విద్యుత్తు శాఖ అధికారులు భావించారు. నిర్ణీత పరిమితి కన్నా ఎక్కువ బాకీ ఉంటే, విద్యుత్తు కనెక్షన్‌ను తొలగించవచ్చునని నిబంధనలు చెప్తున్నాయి. దీంతో బరేలీలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయానికి విద్యుత్తు కనెక్షన్‌ను తొలగించారు. 


Updated Date - 2022-04-15T22:23:41+05:30 IST