యూపీలో మొదటి విడత పోలింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-02-10T12:56:37+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభం అయింది....
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉదయం ఏడుగంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. షామ్లీ, మీరట్, హాపూర్, ముజఫర్ నగర్, భాగపత్, ఘజియాబాద్, బులంద్ షహర్, అలీఘడ్, ఆగ్రా, గౌతంబుద్ధ నగర్, మధుర జిల్లాల్లో పోలింగ్ ప్రారంభం అయింది. 58 సీట్లలో 623 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 2.27 కోట్ల మంది ఓటర్లు పోలింగ్ పర్వంలో పాల్గొంటున్నారు.మొదటి విడత పోలింగ్ పర్వంలో మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేష్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గార్గ్, చౌదరి లక్ష్మీ నరేన్ ల భవితవ్యం తేలనుంది. 25,849 పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు గురువారం ఉదయం బారులు తీరారు.ఘజియాబాద్ కవినగర్ పోలింగ్ కేంద్రంలో యూపీ మంత్రి అతుల్ గార్గ్ ఓటు వేశారు.
నోయిడా ఎక్స్ టెన్షన్ పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.పోలింగ్ కేంద్రాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, మాస్కులు, గ్లౌజులు ఉంచారు.క్యూను నివారించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద టోకెన్లను జారీ చేశారు. భారీ బందోబస్తు మధ్య యూపీ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.