చార్ధామ్ యాత్ర నిలిపివేత : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
ABN , First Publish Date - 2021-04-29T18:00:15+05:30 IST
విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి ప్రభావం చార్ధామ్
న్యూఢిల్లీ : విజృంభిస్తున్న కోవిడ్-19 మహమ్మారి ప్రభావం చార్ధామ్ యాత్రపై కూడా పడింది. ఈ యాత్రను ఈ ఏడాది నిలిపేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ను ఉటంకిస్తూ గురువారం ఓ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చార్ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపేసింది. ఈ నాలుగు దేవాలయాల అర్చకులు మాత్రమే ఈ ఏడాది పూజలు, ఇతర సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు.
ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో చార్ధామ్ దేవాలయాలు ఉన్నాయి. బదరీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలను చార్ధామ్ అంటారు. ఈ దేవాలయాల సందర్శన కోసం వచ్చే భక్తులు తమ పేర్లను నమోదు చేయించుకోవడం కోసం ముసాయిదా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను గతంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తుండటంతో పరిస్థితిని మరోసారి సమీక్షించాలని ప్రభుత్వం భావించింది. దీంతో ఈ ముసాయిదాను బయటపెట్టలేదు.
దేశవ్యాప్తంగా దాదాపు ఓ వారం నుంచి రోజుకు మూడు లక్షలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం, గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,79,257.