గత నాలుగేళ్లలోనే ఉత్తరాఖండ్ అభివృద్ధి జరిగింది: అమిత్షా
ABN , First Publish Date - 2021-10-30T21:08:44+05:30 IST
కేవలం గత నాలుగేళ్లలోనే ఉత్తరాఖండ్లో సర్వతోముఖాభివృద్ధి జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా..
డెహ్రాడూన్: కేవలం గత నాలుగేళ్లలోనే ఉత్తరాఖండ్లో సర్వతోముఖాభివృద్ధి జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారంనాడు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా డెహ్రాడూన్లో జరిగిన ర్యాలీలో అమిత్షా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్, వరదలు వచ్చినప్పుడు కాంగ్రెస్ జాడే లేకుండా పోయిందని విమర్శించారు.
''కోవిడ్, వరదల సమయంలో కాంగ్రెస్ ఏమైందో తెలియదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నారు. హరీష్ రావత్ను (మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత) నేను సవాలు చేస్తున్నాను. ఎన్నికల మేనిఫిస్టోలో ఇచ్చిన వాగ్దానాలను ఎవరు అమలు చేశారనే దానిపై బహిరంగ చర్చకు రావాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన 85 శాతం హామీలను బీజేపీ నెరవేర్చింది'' అని అమిత్షా అన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని, కాంగ్రెస్ హయాంలో హైవేను దిగ్బంధించి, నమాజ్కు అనుమతి ఇచ్చారంటూ కొందరు తన దృష్టికి తెచ్చారని ఆయన చెప్పారు. కాగా, ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ థామి కూడా పాల్గొన్నారు. 70 మంది సభ్యుల ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 11 సీట్లు గెలుచుకుంది.