Uttarakand bus accident : మృతుల సంఖ్య 26కి పెరుగుదల
ABN , First Publish Date - 2022-06-06T18:32:53+05:30 IST
ఉత్తరఖండ్ బస్సు ప్రమాద(Uttarkashi bus accident) దుర్ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది.
డెహ్రడూన్: ఉత్తరఖండ్ బస్సు ప్రమాద(Uttarakand bus accident) దుర్ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ ముగిశాయి. డ్రైవర్తోపాటు 30 మంది భక్తులతో బయలుదేరగా అందులో 26 మంది చనిపోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని ఉత్తరఖండ్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరలోని హాస్పిటల్కు తరలించినట్టు అధికారులు తెలిపారు. మృతులంతా మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాకు చెందినవారు. ఈ దుర్ఘటన సమాచారం అందుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాత్రికి రాత్రే డెహ్రాడున్ చేరుకున్నారు. అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కాగా డ్రైవర్ నిద్రే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. స్టీరింగ్పైనే నిద్రలోకి జారుకున్నాడని, విశ్రాంతి లేకుండా మూడవ ట్రిప్కు వెళ్లాడని ఉత్తరఖండ్ అధికారులకు సమాచారం అందింది.
కాగా ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. యమునోత్రికి భక్తులతో వెళ్తోన్న బస్సు ఆదివారం డంటా ప్రాంతంలో ఒక లోయలో పడిపోయింది. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు దిగినట్లు స్థానిక అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి ఫోన్ చేసి మాట్లాడానని అమిత్ షా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.