తాత్కాలిక కొవిడ్ కేర్ కేంద్రాలుగా ఖాళీ కార్యాలయ భవనాలు
ABN , First Publish Date - 2021-04-23T09:54:15+05:30 IST
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు అందించడం కష్టంగా మారుతోంది.
మార్పునకు పరిశీలించాలని కంపెనీలను కోరిన కేంద్రం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో రోగులకు వైద్య సేవలు అందించడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీల సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న కార్యాలయ భవనాలను తాత్కాలికంగా కొవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని అగ్రస్థాయి కార్పొరేట్లను ప్రభుత్వం గురువారం కోరింది. ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల సెక్రటరీ రాజేష్ వర్మ.. టాప్ 1,000 కంపెనీల సారథులకు లేఖ రాశారు. కొవిడ్పై పోరాటంలో కార్పొరేట్ ఇండియా అందించిన మద్దతును ఆయన ప్రశంసించారు.
అయితే కొవిడ్ రెండో దశలో మరింత సమన్వయం అవసరం ఉందన్నారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, యాక్టివ్ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోందని, భారీగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగిస్తున్న నేపథ్యంలో కొంత మేరకు ఖాళీ కార్యాలయ భవనాలు ఉండవచ్చన్నారు. వాటిని తాత్కాలికంగా కొవిడ్ కేర్ సదుపాయాలుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. కాగా కొవిడ్ కేర్ కేంద్రాల ఏర్పాటు కోసం కార్పొరేట్లు వెచ్చించే మొత్తాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలుగా పరిగణించనున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.