పిల్లలపై కోవ్యాక్సిన్ టీకా ప్రయోగాలు
ABN , First Publish Date - 2021-03-04T16:51:22+05:30 IST
ప్రపంచంలో తొలిసారిగా భారత్లో పిల్లలపై కరోనా వ్యాక్సిన్...
న్యూఢిల్లీ: ప్రపంచంలో తొలిసారిగా భారత్లో పిల్లలపై కరోనా వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు ప్రయోగాలు జరగనున్నాయి. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ టీకా కోవ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్లోని భారత్ బయోటెక్ రూపొందించిన కోవ్యాక్సిన్ను పిల్లలపై ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ప్రస్తుతానికి ఐదేళ్లలోపు చిన్నారులపై ఈ ప్రయోగాలకు మినహాయింపునిచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం భారత్ బయోటెక్ తాజాగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీకి దీనిపై ప్రతిపాదనను పంపింది. తాము చిన్నారులపై కోవ్యాక్సిన్ ప్రయోగాలు చేయాలనుకుంటున్నామని తెలియజేసింది. కాగా ఇంతకుముందే కోవ్యాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ జరిగాయి. కరోనా వ్యాక్సినేషన్ మూడవ దశ నాటికల్లా చిన్నారులకు టీకా అందించాలని భారత్ బయోటెక్ భావిస్తోంది. ఇందుకోసం ఐదేళ్లు దాటి, 18 ఏళ్ల లోపుగల పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహించనున్నారు. అయితే నిపుణుల కమిటీ చిన్నారులపై వ్యాక్సిన్ పరీక్షలకు ఇంకా అనుమతినివ్వలేదు. పెద్దలపై వ్యాక్సిన్ ప్రభావాలను పూర్తి స్థాయిలో పరీక్షించిన అనంతరం నిపుణుల కమిటీ పిల్లలపై వ్యాక్సిన్ ప్రయోగాలకు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.