టీహాకారాలు..!
ABN , First Publish Date - 2021-05-11T06:51:10+05:30 IST
జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ అంతా గందరగోళంగా మారడంతో జనంలో గుబులు రేగుతోంది. సకాలంలో వ్యాక్సిన్ అందదనే ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకపక్క తొలి డోసు కోసం 45 ఏళ్లు నిండిన వాళ్లు వేలల్లో ఎదురుచూస్తుంటే, రెండో డోస్ కోసం లక్ష మందిపైగా పడిగాపులు కాస్తున్నారు.
- జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ అందక జనం అగచాట్లు
- కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండో డోస్ కోసం 1.03 లక్షల మంది ఎదురుచూపులు
- వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియక, వచ్చినా అందుతుందో అర్థంకాని అయోమయం
- ఒక డోస్ పూర్తయిన వృద్దుల్లో అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన
- పంపిణీ విధానం ఒక్కసారిగా మార్చేయడంతో అంతా గందరగోళం
- కూపన్ల విధానంతో తమ వరకు రాదేమోనని కలవరం
- అస్తవ్యస్త విధానంతో మూడు రోజులుగా పంపిణీకి బ్రేక్.. బుధవారం నుంచే పంపిణీ
- అది కూడా అందుబాటులో 12,900 కొవిషీల్డ్, 1,500 కొవాగ్జిన్ డోసులు మాత్రమే
- తొలి డోసు కోసం 45 ఏళ్లు దాటిన 42 వేల మంది ఇంకా ఎదురుచూపులు
జిల్లాలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ అంతా గందరగోళంగా మారడంతో జనంలో గుబులు రేగుతోంది. సకాలంలో వ్యాక్సిన్ అందదనే ఆందోళన అంతకంతకూ పెరిగిపోతోంది. ఒకపక్క తొలి డోసు కోసం 45 ఏళ్లు నిండిన వాళ్లు వేలల్లో ఎదురుచూస్తుంటే, రెండో డోస్ కోసం లక్ష మందిపైగా పడిగాపులు కాస్తున్నారు. తీరా ప్రస్తుత పంపిణీ విధానం అస్తవ్యస్తంగా మారడంతో అసలు మూడు రోజులుగా పంపిణీయే జరగడం లేదు. దీంతో అంతా కలవరపడుతున్నారు. కొత్తగా కూపన్ల విధానం ప్రవేశపెట్టడంతో తమ వంతు వచ్చే సరికి ఎంతకాలం పడుతుందోనన్న బెంగ వేధిస్తోంది. ఒకపక్క అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించి వ్యాక్సిన్లు పొందుతుంటే తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కాగా బుధవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న వ్యాక్సిన్లకు కేవలం 12,900 కొవిషీల్డ్, 1,500 కొవాగ్జిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
కొవిడ్ టీకా పంపిణీ జిల్లాలో గందరగోళంగా మారింది. వ్యాక్సిన్ వచ్చిన మొదట్లో కేవలం ప్రంట్లైన్ వారియర్స్కు మాత్రమే దీన్ని పంపిణీ చేయగా, వారి సంఖ్య తగ్గడంతో ప్రభుత్వం 45ఏళ్లు ఆపై నిండిన వారికి టీకా పంపిణీ ప్రారంభించింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా తొలి డోసు కింద అందరికీ కలిపి కొవిషీల్డ్ 4,00,015 వ్యాక్సిన్లు, ఇవ్వగా, వీరిలో సెకండ్ డోస్ 1,77,369 మందికి పంపిణీ చేశారు. ఇంకా 2,22,646 లక్షల మందికి సెకండ్ డోస్ ఇవ్వాల్సి ఉంది. వీరిలో వేలాదిమందికి ఇప్పటికే గడువు ముగి సింది. ఈపాటికే టీకా అందాల్సి ఉండగా ప్రభుత్వం చేతులెత్తేసింది. కొవాగ్జిన్ విషయానికి వస్తే అన్ని వర్గాలకు కలిపి ఇప్పటివరకు తొలి డోస్ కింద 91,163 మందికి టీకా ఇవ్వగా, సెకండ్ డోస్ 19,678 మం దికి పంపిణీ చేశారు. ఇంకా రెండో డోస్ 71,485 మందికి ఇవ్వాల్సి ఉంది. కానీ వీరిలో వేలాది మందికి గడువు ముగిసినా ఇంకా టీకా అందలేదు. వాస్తవానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ కలిపి రెండో డోస్ 2,94,131 మందికి ఇవ్వాల్సి ఉండగా వీరిలో 1,03,781 మందికి గడువు దాటిపోయింది. అయినా ఇంకా టీకా అంద డం లేదు. వీరిలో కాకినాడ డివిజన్లో అత్యధికంగా 27,068మంది ఉండగా, రాజమహేంద్రవరం రెవె న్యూ డివిజన్ పరిధిలో 14,517, అమలాపురం డివిజన్లో 19,677, పెద్దాపురం 10,469, రామచంద్రపురం 7,385, రంపచోడవరం 1,913, ఎటపాక 769, ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో టీకా తీసుకున్నవారు 21,983 మంది ఉన్నారు. వీరందరికి గడువు ముగిసి వారాలు దాటుతున్నా వ్యాక్సిన్ అందక ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా 50 నుంచి 70 ఏళ్లలోపు వారి పరిస్థితి ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఒకపక్క ప్రస్తుత టీకా విధానం అస్త్యవ్యస్తంగా మారడంతో కూపన్ల విధానం ప్రవేశపెట్టారు. పైగా మూడ్రోజుల నుంచి పంపిణీ నిలిపివేశారు. ఈ తరుణంలో కూపన్లు తమ వరకు వస్తాయా? అనే ఆందోళన అందరినీ వేధిస్తోంది. గ్రామస్థాయిలో వలంటీర్లు వీటిని పంపిణీ చేస్తుండడంతో అధికారపార్టీ నేతలు, అనుచరులు, పలుకుడి ఉన్న వారికే ఇవి అందు తున్న పరిస్థితి నెలకొంది. దీంతో తమ పరిస్థితి ఏంటని వీరంతా గుబులు చెందుతున్నారు. మరోపక్క రాజకీయ పలుకుబడితో వ్యాక్సిన్లు దారిమళ్లుతున్న నేపథ్యంలో పీహెచ్సీల వారీగా ఎవ రికి ఎప్పుడు ఏ డోసు వేయాలనే వివరాలను జిల్లా అధికారులు రప్పించుకుని ఎవరికి ఎప్పుడు టీకా అందించాలో ఆ పేర్లను టిక్ చేసి తిరిగి జాబితా పీహెచ్సీలకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో డోస్ ఇంకా అందాల్సి ఉన్న వారికి ఎప్పటికి ఇదంతా పూర్తవుతుందో అర్థంకాని ప్రశ్న. మరోపక్క సెకండ్ డోస్ లక్షమందికిపైగా అందాల్సిన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా కేంద్రం, ఇతర పీహెచ్సీల్లో మొత్తం 12,900 కొవిషీల్డ్, 1,500 కొవాగ్జిన్ డోసులు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన వారికి ఎప్పుడు టీకా పంపిణీ జరుగుతుందో తెలియని పరిస్థితి. కాగా 45 ఏళ్లు నిండిన వారికి టీకా ప్రక్రియలో జిల్లాలో ఇంకా 42 వేల మందికిపైగా అసలు ఒక్క డోసు కూడా అందలేదు. ఈ నేపథ్యంలో వారంతా వ్యాక్సిన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈవారంలో అందిస్తారని భావించినా కేవలం రెండో డోసు వారికే ప్రాధాన్యం అని చెప్పడంతో కలవరపాటుకు గురవుతున్నారు. ప్రభుత్వం అందించక, ప్రైవేటుగా దొరక్క టెన్షన్ పడుతున్నారు.