నిలబెట్టి అమ్మేస్తాడు
ABN , First Publish Date - 2021-11-19T07:00:05+05:30 IST
మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి అనుచరుడి వసూళ్ల పర్వానికి అంతేలేకుండా పోతోంది.
మంత్రి అనుచరుడిపై వాడపాలెం ప్రజల ఆగ్రహం
వలకట్లను రూ.5.90 లక్షలకు అమ్మేశారు
ఉద్యోగాలకూ రూ.లక్షల్లో బేరం
ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : మచిలీపట్నం నియోజకవర్గంలో మంత్రి అనుచరుడి వసూళ్ల పర్వానికి అంతేలేకుండా పోతోంది. గ్రామ పంచాయతీల్లోనూ వసూళ్లకు పాల్పడటం వివాదాస్పదమవుతోంది. ఈయన తీరుపై పలు గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు మండిపడుతున్నారు. మంత్రి అనుచరుడి అవినీతికి, అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని వాడపాలెం పంచాయతీ ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
వలకట్లను అమ్మినా అడిగేవారు లేరు
బందరు రూరల్లోని వాడపాలెం పంచాయతీ కృష్ణానది పక్కనే ఉంటుంది. ఈ పంచాయతీ పరిధిలో కృష్ణానదికి అనుబంధంగా శింకులు, ప్రధాన డ్రెయినేజీలు ఉన్నాయి. వీటిలో వలకట్లకు వేలంవేసే అధికారం పంచాయతీ పాలకవర్గానికే ఉంటుంది. పంచాయతీ పరిధిలోని వెంకట దుర్గాంబపురానికి చెందిన మత్స్యకారులు ఈ వలకట్లను వేలంపాటలో పాడుకుని పంచాయతీకి నగదు చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ వలకట్ల ద్వారానే తమ గ్రామంలోని మత్స్యకారులు జీవనం సాగిస్తారని వారు చెబుతున్నారు. తాజాగా మంత్రి అనుచరుడు తన పరపతిని ఉపయోగించి వలకట్లను గుట్టుచప్పుడు కాకుండా రూ.5.90 లక్షలకు విక్రయించేశాడని మత్స్యకారులు వాపోతున్నారు. ఏళ్లతరబడి తాము వలకట్లు కట్టుకుంటుంటే, వేరే వ్యక్తులకు వీటిని విక్రయించడమేమిటంటూ, గ్రామస్థులంతా కలసికట్టుగా వెళ్లి వలకట్లను తొలగించారు. దీనిపై పెద్దల వద్ద పంచాయతీ పెడితే, మంత్రి అనుచరుడితోనే మాట్లాడుకోవాలని సలహా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సబ్స్టేషన్ ఉద్యోగాలలోనూ..
వాడపాలెం గ్రామంలో వలకట్ల వ్యవహారంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఈ మంత్రి అనుచరుడు గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని వసూళ్లకు తెర తీసినట్టు తెలుస్తోంది. వాడపాలెం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం, వెంకట దుర్గాంబపురం గ్రామాల్లో అర్హత ఉన్న ముగ్గురికి ఉద్యోగాలు ఇవ్వాలని మూడు గ్రామాల పెద్దలు నిర్ణయించగా, మంత్రి అనుచరుడు జోక్యం చేసుకుని ఒక్కో పోస్టుకు లక్షల్లో డిమాండ్ చేస్తున్నాడని, తాను చెప్పినవారికే ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నాడని, అదేమని ప్రశ్నిస్తే, ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.