‘అమ్మఒడి’ అమలులో మోసం: వంగలపూడి అనిత
ABN , First Publish Date - 2022-04-17T00:58:21+05:30 IST
ఎన్నికల వేళ అందరికీ ‘అమ్మ ఒడి’ అంటూ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక ‘షరతులు వర్తిస్తాయి
విశాఖపట్నం: ఎన్నికల వేళ అందరికీ ‘అమ్మ ఒడి’ అంటూ హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న జగన్ అధికారంలోకి వచ్చాక ‘షరతులు వర్తిస్తాయి’ అంటూ కొందరికే అందిస్తున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. నిబంధనల పేరుతో ఎక్కువ మందికి ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ‘అమ్మఒడి’ విషయంలో లబ్ధిదారులను వైసీపీ మోసం చేస్తోందంటూ టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం చెవిలో పూలు పెట్టుకుని తెలుగు మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకుంటున్న 80 లక్షల మంది పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తామని సీఎం జగన్తోపాటు ఆయన సతీమణి భారతి కూడా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు 40 లక్షల మందికే ఇస్తున్నారన్నారు. ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో ఒకరికే ఇస్తామని షరతు పెట్టడం విడ్డూరమన్నారు. దీనిపై సీఎంతోపాటు భారతి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే 75 శాతం హాజరు ఉండాలన్న నిబంధన కరోనా కాలంలో ఎలా సాధ్యమని చెప్పారు. ఇక, విద్యుత్ వాడకం 300 యూనిట్లు దాటితే నిలిపి వేస్తామంటున్నారని, వేసవిలో ఇది సాధ్యమేనా అని వంగలపూడి అనిత ప్రశ్నించారు.