Jagan reddy ఓ Autoలో రోడ్లపై తిరిగివస్తే డ్రైవర్ల కష్టాలు తెలుస్తాయి: Anita
ABN , First Publish Date - 2022-07-15T18:26:14+05:30 IST
ఏపీలోని రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే నడుం ఇరగటం.. లేదా ప్రజలు నడుం ఇరక్కొడతారనే భయంతో...
అమరావతి (Amaravathi): ఏపీ (AP) లోని రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే నడుం ఇరగటం.. లేదా ప్రజలు నడుం ఇరక్కొడతారనే భయంతో సీఎం జగన్ (CM Jagan) రెండు కిలోమీటర్ల ప్రయాణానికి కూడా హెలికాఫ్టర్ (Helicopter) వాడుతున్నారని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) విమర్శించారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వాహనమిత్రకు డబ్బులిచ్చే ముందు జగన్ రెడ్డి ఓ ఆటోలో రోడ్లపై తిరిగివస్తే డ్రైవర్ల కష్టాలు తెలుస్తాయన్నారు. దేశంలో ఎక్కడాలేని పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనే ఉన్నాయని, లీటర్పై రూ. 12 వరకూ అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ప్రజల ఇంటి ముందు స్విమ్మింగ్ పూల్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
2 కిలోమీటర్ల దూరంలో గతుకులు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? అని అనిత ప్రశ్నించారు. జనాల్ని పీడించటంలో జగన్ రెడ్డి నెంబర్ వన్ అని అన్నారు. రాష్ట్రంలో రిజిస్టర్ డ్రైవర్లు 10 లక్షల మందికిపైగా ఉంటే కేవలం 2.60 లక్షల మందికే వాహనమిత్ర ఇచ్చి, అందరినీ ఉద్దరిస్తున్నట్లు చెప్పటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి ఏడాదికి రూ. 10 వేలు వాహనమిత్ర కింద ఇస్తుంటే, డ్రైవర్లకు నెలకు రూ.10 వేలకు పైగా మెంటినెన్స్ కింద ఖర్చవుతోందన్నారు. పన్నులు, ఫైన్లు రూపేణా పోలీసుల సాయంతో పదింతలు రౌడీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మెదడులో గుజ్జు కాస్తా మోకాలులోకి జారిపోయిందని తాజా చర్యలతో స్పష్టమవుతోందని వంగలపూడి అనిత అన్నారు.