120 ఏళ్ల జ్ఞాపకం కూలింది..
ABN , First Publish Date - 2022-05-27T06:53:02+05:30 IST
పశ్చిమ డెల్టా కాలువలపై బ్రిటీషర్లు నిర్మించిన బ్రిడ్జిలు, రెగ్యులేటర్లు ఎన్నో ఎన్నెన్నో..వీటిలో కొన్ని ఇప్పుడిప్పుడే కనుమరుగవుతూ జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి.
బ్రిటీషర్లు నిర్మించిన కాకరపర్రు రెగ్యులేటర్ తొలగింపు
నిడదవోలు, మే 26 : పశ్చిమ డెల్టా కాలువలపై బ్రిటీషర్లు నిర్మించిన బ్రిడ్జిలు, రెగ్యులేటర్లు ఎన్నో ఎన్నెన్నో..వీటిలో కొన్ని ఇప్పుడిప్పుడే కనుమరుగవుతూ జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి.ఇదే కోవలో సుమారు 120 ఏళ్ళ కిందట శెట్టిపేట శివారున కాకర పర్రు రెగ్యులేటర్ను నిర్మించారు. ఈ కాలువ ద్వారానే దిగువన ఉన్న నర్సాపురం కాలువల పరిధిలో రైతన్నలకు గోదావరి జలాలు అందుతాయి. గోదావరి డెల్టా ఆధునికీకరణలో భాగంగా 2017లో శెట్టిపేట శివారు కాకరపర్రు రెగ్యులేటర్ సమీపంలోనే మరో కొత్త రెగ్యులేటర్ నిర్మించారు. అయితే ఆ రెగ్యులేటర్కు నేటికి విద్యుత్ సౌకర్యం లేక మాన్యువల్గానే గేట్లను సిబ్బంది ఆపరేట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఒక నేత కాకరపర్రు పాత రెగ్యులేటర్ ఉపయోగంలో లేనందున తొలగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపఽథ్యంలో గురువారం జలవనరుల శాఖాధికారులు కాకరపర్రు పాత రెగ్యులేటర్ను తొలగించారు. సుమారు 120 ఏళ్ళ చరిత్రకు సాక్షిగా నిలిచిన కాకరపర్రు రెగ్యులేటర్ చరిత్రపుటలలో జ్ఞాపకంగా మిగిలి పోయింది. దీనిపై పశ్చిమ డెల్టా ఈఈ ఎమ్.దక్షిణామూర్తి మాట్లాడుతూ కొత్త రెగ్యులేటర్ నిర్మించి ఐదేళ్లవుతుందని.. పాత రెగ్యులేటర్ శిఽథిలావస్థకు చేరడం, ఎటు వంటి ఉపయోగం లేకపోవడంతో తొలగించడం జరిగిందని తెలిపారు.