దళితుల విషయంలో కంసమామలా జగన్: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2021-12-25T00:45:55+05:30 IST

దళితులకు తాను మేనమామనని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి, వారి విషయంలో కంసమామలా ప్రవర్తిస్తున్నట్లుగా ఉందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు.

దళితుల విషయంలో కంసమామలా జగన్: వర్ల రామయ్య

అమరావతి: దళితులకు తాను మేనమామనని ప్రకటించుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి, వారి విషయంలో కంసమామలా ప్రవర్తిస్తున్నట్లుగా ఉందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు  వర్ల రామయ్య  అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ దళితులకు అబద్ధపు, అసత్యపు మాటలుచెప్పి, అసాధ్యపు వాగ్ధానాలు ఇచ్చి, వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి,  ఇప్పుడు వారికి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. దళితుల సంక్షేమం విషయంలో తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. దళితులు ఎప్పుడూ బానిసల్లా, కార్మికుల్లా బతకాలన్నదే ఈముఖ్యమంత్రి ఆలోచనా?.  టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన హాయాంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2లక్షల74వేలమంది దళిత యువతకు రూ.3,795కోట్ల రుణాలిచ్చారు.


జగన్ వచ్చాక ఒక్క దళిత యువకుడికైనా రూపాయి సాయం చేశారా?. ఆర్థికంగా స్థిరపడేలా ఒక్క దళిత కుటుంబాన్నైనా ఆదుకున్నారా?. 2022 ఏప్రియల్ 14 నాటికి స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిచేస్తామని, దళితజాతికి అంకితం చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు ఉత్తుత్తి ప్రగల్భాలుగా మారాయి.జగన్ దళితులకు రూపాయి రుణం ఇవ్వకుండా, ఎస్సీ కార్పొరేషన్‌ను మాల కార్పొరేషన్, మాదిగ కార్పొ రేషన్, రెల్లి కార్పొరేషన్లుగా విడగొట్టి, వాటిని ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు.దళితబిడ్డలు కార్పొరేట్ స్కూళ్లలో చదవడం ఇష్టం లేకనే, ముఖ్యమంత్రి  బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విద్యావిధానాన్ని రద్దుచేశారా?. 


దళితులు అగ్రకులాలతో వియ్యం అందుకోవడాన్నిజీర్ణించుకోలేకనే జగన్ చంద్రబాబు అమలు చేసిన కులాంతర వివాహ ప్రోత్సాహాకం పథకాన్ని, దాని కింద ఇచ్చే రూ.లక్ష సొమ్ముని రద్దుచేశారా?అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దళిత బిడ్డలు విదేశాలకు వెళ్లి చదువుకుంటే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బందేమిటి?.చంద్రబాబు దళితులకు 3వేల ఎకరాల భూములిస్తే, జగన్ ఇళ్లస్థలాల పేరుతో 11వేల ఎకరాల దళితుల భూమిని లాక్కున్నది నిజంకాదా?.రూ.4వేల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను  దారిమళ్లించింది వాస్తవం కాదా?.జగన్ దళితులను వంచించినా, కొట్టినా, తిట్టినా, వారిని వేధిస్తున్నా, వారిని చిన్నచూపు చూస్తున్నా కూడా అధికార పార్టీలోని దళిత నేతలు ఆయనకు వత్తాసూ పలుకుతున్నారు’’ అని వర్ల రామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-25T00:45:55+05:30 IST