రైతులకు గండం

ABN , First Publish Date - 2021-11-11T04:55:54+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి గురువారానికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

రైతులకు గండం
తెనాలి-బుర్రిపాలెం మధ్య పొలాల్లో మొన్నటి వర్షాలకు నేలవాలిన వరి

కోతకొచ్చిన దశలో వరి పంట

వాతావరణ మార్పులతో రైతుల్లో గుబులు

దిగుబడులపై ప్రభావం పడుతుందని భయం

వాతావరణశాఖ హెచ్చరికలతో రైతన్నల్లో ఆందోళన


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరిక. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులతో వాతావరణం మారింది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియడంలేదు. పొలాల్లో ఏమో కోతకొచ్చిన పంట ఉంది. ఆకాశం కేసి చూసుకోవడం.. ఆందోళన చెందడం.. వర్షం పడితే నోటికాడకు వచ్చిన పంట అందదేమోనని భయం. ఇదీ జిల్లాలోని అన్నదాతల పరిస్థితి. ఇప్పటికిప్పుడు కోత కోయడం అసాధ్యం. ఒకవేళ కోత కోస్తే నిల్వ చేసేది ఎలా.. అమ్ముకోవాలన్నా వచ్చేది ఎవరు.. అలాగే వదిలేస్తే దిగుబడులపై ప్రభావం పడుతుందేమోనని గుబులతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. 


తెనాలి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి గురువారానికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ హెచ్చరికలకు అనుగుణంగా రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయుగుండం హెచ్చరికలతో వరి రైతుల గుండెల్లో గుబులు మొదలైంది. మరో వారం నుంచి పది రోజుల్లో కోత కోసేందుకు సిద్ధమైన దశలో వాయుగుండం వార్త పిడుగుపాటుకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌లో 4.91 లక్షల ఎకరాలు ఒక్క గుంటూరు జిల్లాలోనే ఉంది. ప్రకాశం బ్యారేజికి దిగువున కాల్వలకు ఎగువున ఉన్న మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర, తెనాలి ప్రాంతాల్లోని భూముల్లో ఇప్పటికే వరి కోత దశకు వచ్చింది. కొల్లూరు, వేమూరు, అమృతలూరు, చుండూరు, భట్టిప్రోలు, రేపల్లె, పొన్నూరు, పి.వి.పాలెం వంటి మధ్య భూముల్లోనూ పంట కంకి దశలో ఉంది. బాపట్ల, కర్లపాలెం, కాకుమాను, నగరం మండలాల్లో చాలావరకు కంకులు వచ్చేస్తే, వీటిలో సగభాగం పాలుపోసుకునే దశకు వచ్చాయి. వీటిలోనూ మరో పక్షం రోజుల నుంచి నెల రోజుల్లో వరి కోతలు మొదలుపెట్టే పరిస్థితి ఉంది. ఈ తరుణంలో వాయుగుండం వార్తలతో రైతుల్లో గుబులు మొదలైంది. ఈ నెల తొలివారంలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు భారీగానే పడ్డాయి. దీంతో కంకులకు మానుకాయ వేయటం, చివరి భూముల్లో కంకు రాలిపోయి దిగుబడులపై ప్రభావం చూపింది. ఎగువ భూముల్లో మాత్రం సుమారు లక్ష ఎకరాల వరకు వరి పైరు నేలవాలిపోయింది. దీనిని నిలబెట్టి కట్టుకోవడానికే రైతులకు భారం పడితే, దిగుబడులపైనా ప్రభావం పడింది. ఇప్పటికే పలుమార్లు వర్షాలువచ్చి పంట దెబ్బతినిపోయిన తరుణంలో మళ్లీవాయుగుండం కారణంగా ఓ మోస్తరు వర్షాలుపడినా పంట దెబ్బతినిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే గాలులతోకూడిన భారీ వర్షాలు పడితేమాత్రం మిగిలేది ఏమీ ఉండదని పైరంతా నేలపై చాపలా పరుచుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. దిగుబడులు సగానికి సగం దెబ్బతినిపోయే పరిస్థితితోపాటు, ఉన్న కొద్దిపాటి కంకులకు కూడా మానుకాయ వేయటం, కోతకొచ్చిన చేలల్లో మొలకలొచ్చే పరిస్థితి ఉంటుందంటున్నారు. తమిళనాడు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని రైతులు మరింత భయపడిపోతున్నారు.  


Updated Date - 2021-11-11T04:55:54+05:30 IST