సింగపూర్లో అత్యంత వైభవోపేతంగా వాసవి మాత జయంతి వేడుకలు
ABN , First Publish Date - 2022-05-17T03:01:13+05:30 IST
సింగపూర్లో నివసిస్తున్న ఆర్యవైశ్యులందరు కలిసి వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో స్థానిక మారియమ్మన్ ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకం జరిపించారు.
సింగపూర్లో నివసిస్తున్న ఆర్యవైశ్యులందరు కలిసి వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో స్థానిక మారియమ్మన్ ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా కన్యపిల్లలకు విశేషంగా కన్యపూజలు, సామూహిక కుంకుమార్చన తదుపరి అమ్మవారి రథోత్సవం నిర్వహించారు. భక్తుల జయజయ ద్వానాల మధ్య ఈ కార్యక్రమం కనులపండువగా సాగింది. కార్యక్రమానికి విశేష అతిథులుగా హాజరైన ఆలయ చైర్మన్ శ్రీ కదిరీషన్, ఆలయ ఉప ఛైర్మెన్ శ్రీనివాస్, స్థానిక వైశ్యులకు ధర్మసంబంధ విషయాల్లో మెళుకులవలు చెప్పే కృష్ణ శర్మను వాసవి క్లబ్ వ్యవస్థాపకులు వెంకట నాగరాజ్ కైలా, పూర్వ సెక్రటరీ శ్రీధర్ సన్మానించారు.
వాసవి క్లబ్ ప్రస్తుత అధ్యక్షులైన అరుణ్ కుమార్ గొట్లూరు మాట్లాడుతూ.. కోవిడ్ పరిస్థితుల కారణంగా గత రెండు సంవత్సరాలుగా కార్యక్రమాలన్నీ జూమ్ పద్దతిలో జరుపుకున్నామని తెలిపారు. మళ్ళీ ఇంతకాలానికి సభ్యులందరి మధ్య ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేసారు. కార్యక్రమం మొదటినుంచి సమన్వయం చేస్తూ వచ్చిన వాసవి క్లబ్ సెక్రటరీ నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ సింగపూర్లో వాసవి క్లబ్ వారు గత పది సంవత్సరాలుగా చేసిన అమ్మవారి విశేష పూజ కార్యక్రమాల వివరాలు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే మారియమ్మన్ ఆలయ జీర్ణోద్ధరణలో వైశ్యులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని, వైశ్యులు ఎప్పుడు మన ధర్మాన్ని విడనాడకుండా మరెన్నో సేవాకార్యక్రమాల్లో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముందుకెళ్లడానికి విశేషంగా కృషి చేసిన వాసవి క్లబ్ కమిటీ సభ్యులైన ముక్కా కిషోర్, రాజా విశ్వనాథుల, మకేష్ భూపతి, మురళి పబ్బతికి ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. 200 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమానికి తోడుగా నిలిచిన సభ్యులు శివాజీ, కిషోర్, వినయ్, శివ, నరేష్, ఫణీష్, వినోదన్కు అతిథులందరు పేరు పేరునా కృతజ్ఞల చెప్పారు. భోజనానంతరం ఈ కార్యక్రమం ముగిసింది.