వీసీబీఎల్ లావాదేవీల లక్ష్యం రూ.7,500 కోట్లు
ABN , First Publish Date - 2022-06-29T06:17:35+05:30 IST
దక్షిణ భారతదేశంలో తమ బ్యాంక్ ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(వీసీబీఎల్) ప్రథమ స్థానంలో నిలిచిందని, 2022-23 సంవత్సరానికి రూ.7,500 కోట్ల ఆర్థిక లావాదేవీలు లక్ష్యంగా సాగుతున్నట్టు బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.
బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు
సీతంపేట, జూన్ 28: దక్షిణ భారతదేశంలో తమ బ్యాంక్ ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్(వీసీబీఎల్) ప్రథమ స్థానంలో నిలిచిందని, 2022-23 సంవత్సరానికి రూ.7,500 కోట్ల ఆర్థిక లావాదేవీలు లక్ష్యంగా సాగుతున్నట్టు బ్యాంక్ చైర్మన్ చలసాని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ద్వారకానగర్లో గల బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ నగర కేంద్రంగా 1916 ఫిబ్రవరి 5న బ్యాంక్ కార్యకలపాలు ప్రారంభించిన బ్యాంక్, ప్రస్తుతం 107వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఆంధ్రపద్రేశ్లో 46, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో 4 బ్రాంచీలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 1984-85 సంవత్సరంలో రూ.2.91 కోట్ల కార్యకలాపాలతో ఉన్న బ్యాంక్ 2021-22 నాటికి రూ.6797.96 కోట్ల స్థాయికి చేరుకుందన్నారు. అలాగే 1984-85లో 3661 మంది సభ్యులతో రూ.9 లక్షల షేరుధనం మాత్రమే కలిగిన బ్యాంక్ 2021-22 సంవత్సరానికి 92,200 మంది సభ్యులతో రూ.272 కోట్టు షేరు ధనం కలిగి ఉన్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా బ్యాంక్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా 2625 మంది సభ్యులకు రూ.6.62 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిందని, ఇది బ్యాంక్ చరిత్రలోనే అత్యధికమన్నారు. ఈ ఏడాధి సభ్యులకు షేరు ధనంపై రూ.24.98 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో చెల్లించామని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ పూర్వపు చైర్మన్ మానం ఆంజనేయులు, సీనియర్ ఉపాధ్యక్షులు గుడివాడ భాస్కరరావు, డైరెక్టర్ ఏజే స్టాలిన్, కాకి భవాని, సిరువూరి జానకి రామచంద్ర రాజు, ఉప్పలపాటి పార్వతీదేవి, సీహెచ్.ఆదినారాయణ శాస్త్రి, ముఖ్య కార్యనిర్వాహక అధికారి పీవీ నరసింహమూర్తి, జనరల్ మేనేజర్ ఏవీ రామకృష్ణారావు, పర్యవేక్షణాధికారి ఎ.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.