వాహన సేవల ముందు వేదపఠనం

ABN , First Publish Date - 2022-06-27T06:49:43+05:30 IST

తిరుమల తరహాలో కాణిపాకంలోనూ వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వేదపండితులు వేదపఠనం చేయాలని ఉభయదారులు కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఉభయదారులు ఉభయ వరస తీసుకొచ్చే సమయంలో ఆలయం నుంచి మేళతాళాలతో ఆహ్వానం పలకాలన్నారు.

వాహన సేవల ముందు వేదపఠనం
మణికంఠేశ్వర ఆలయంలో ఉభయదారులతో మాట్లాడుతున్న చైర్మన్‌, ఈవో

తిరుమల తరహాలో కాణిపాకంలోనూ అమలు చేయాలి 


అధికారులకు ఉభయదారులన సూచన 


భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలివ్వాలని డిమాండ్‌ 


ఐరాల(కాణిపాకం), జూన్‌ 26: తిరుమల తరహాలో కాణిపాకంలోనూ వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వేదపండితులు వేదపఠనం చేయాలని ఉభయదారులు కోరారు. బ్రహ్మోత్సవాల్లో ఉభయదారులు ఉభయ వరస తీసుకొచ్చే సమయంలో ఆలయం నుంచి మేళతాళాలతో ఆహ్వానం పలకాలన్నారు. కాణిపాకంలోని వరసిద్ధుడి అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వర ఆలయంలో ఆదివారం 14 గ్రామాలకు చెందిన ఉభయదారులతో అధికారులు సమావేశమయ్యారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ఆలయ మహాకుంభాభిషేకం, బ్రహ్మోత్సవాల నిర్వహణపై పలు కీలక తీర్మానాలు చేశారు. ఉభయదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండు చేశారు. ఆలయ అభివృద్ధికి గతంలో భూములు కోల్పోయిన ఒక్కో రైతు కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. వరసిద్ధుడి ఆలయ పునర్నిర్మాణానికి దాతృత్వం వహించన దాత కుటుంబ సభ్యులకు 14 గ్రామాలకు చెందిన ఉభయదారుల తరపున వందనాల తెలియజేశారు. ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలన్నారు. కమ్మవారి అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని కోరారు. ఆలయంలో నిర్వహించే మహాకుంభాభిషేకానికి ఉభయదారుల తరపున 21న పట్టు వస్త్రాలు సమర్పించడానికి తీర్మానం చేశారు. ఆలయంలో నిర్వహించే మహాకుంభాభిషేకానికి, వార్షిక బ్రహ్మోత్సవాలకు సహకారం అందిస్తామన్నారు. ఆలయ పాలక మండలి చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు మాట్లాడుతూ.. ఆలయ పునర్నిర్మాణ పనులు జూలై 31కి పూర్తవుతాయన్నారు. ఆగస్టు 4న ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహాకుంభాభిషేక పూజలు ప్రారంభమవుతాయని వివరించారు. 21న ఆలయ మహాకుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది ఆగస్టు 31 నుంచి సెప్టంబర్‌ 20 వరకు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాణిపాకం సర్పంచి శాంతిసాగర్‌రెడ్డి, ఈఈ వెంకటనారాయణ. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనరు కస్తూరి, ఏఈవోలు విద్యాసాగర్‌రెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ఉభయదారుల సంఘ అధ్యక్షుడు ఈశ్వర్‌బాబు, మాజీ చైర్మన్‌లు మణి నాయుడు, జగన్నాథరెడ్డి, 14 గ్రామాల ఉభయదారులు పాల్గొన్నారు. 



ఆగస్టు 31 నుంచి వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలు


కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను ఆగస్టు 31 నుంచి సెప్టంబరు 20 తేది వరకు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న వినాయక చవితితో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజున కాణిపాక విఘ్నేశ్వర యువజన సంఘం వారితో పుష్పకావుళ్ల సమర్పణ, సెప్టంబరు 1న ధ్వజారోహణం, రాత్రి హంస వాహనం, 2న నెమలి వాహనం, 3న మూషిక, 4న శేష, 5న వృషభ, 6న గజ వాహన సేవలు, 7న రథోత్సవం, 8న తిరుకల్యాణం, అశ్వవాహనం, 9న ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనంతరం 10 నుంచి ప్రత్యేక ఉత్సవాలు ప్రారభమవుతాయి. 10న అధికారనంది వాహనం, 11న రావణబ్రహ్మ, 12న యాళివాహనం, 13న విమానోత్సవం, 14న సూర్యప్రభ, 15 చంద్రప్రభ, 16న కామధేను వాహనసేవ, 17న పుష్ప పల్లకి, 18న కల్పవృక్ష వాహనం, 19న పూలంగి సేవ, 20న తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి. 


కాణిపాకం కిటకిట 


వరసిద్ధుడి దర్శనార్థం వచ్చిన భక్తులతో కాణిపాకం ఆదివారం కిటకిటలాడింది. జిల్లా నలుమూల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. స్వామి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తుల మధ్య తొక్కిసలాటలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ అందించారు. 

Updated Date - 2022-06-27T06:49:43+05:30 IST