రాజన్న క్షేత్రంలో శ్రావణ సందడి
ABN , First Publish Date - 2022-08-15T05:56:16+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మందికిపైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు, మేయిన్రోడ్డు, జాత్రాగ్రౌండ్, బద్దిపోచమ్మ వీధి కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు.
వేములవాడ, ఆగస్టు 14: వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణమాసం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 25 వేల మందికిపైగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు, మేయిన్రోడ్డు, జాత్రాగ్రౌండ్, బద్దిపోచమ్మ వీధి కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకం, అన్నపూజ, నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం, కుంకుమపూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం రెండు గంటలకు పైగా సమయం, కోడెమొక్కు చెల్లింపు కోసం మూడు గంటల సమయం పట్టింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ఖజానాకు సుమారు రూ.20 లక్షలకు పైగా ఆదాయం సమకూరినట్లు అంచనా. నాలుగేళ్లుగా ఆదివారాల్లో స్వామివారి గర్భాలయంలో అభిషేక పూజలు నిలిపివేయగా, తాజాగా ఆదివారం గర్భాలయంలో అభిషేకం, అన్నపూజలకు అనుమతించారు.