automatic mask vending machines :రెండు రూపాయల నాణెం వేస్తే మాస్క్
ABN , First Publish Date - 2021-07-10T16:35:09+05:30 IST
మాస్కుల పంపిణీకి ఆటోమేటిక్ మాస్కు వెండింగ్ మెషీన్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి....
హుబ్లి (కర్ణాటక): మాస్కుల పంపిణీకి ఆటోమేటిక్ మాస్కు వెండింగ్ మెషీన్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ఏటీఎం తరహాలో ఉన్న ఈ మెషీన్ లో రెండు రూపాయల నాణెం వేస్తే చాలు ఒక సర్జికల్ మాస్కు లభిస్తోంది.కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దీని బారి నుంచి కాపాడుకునేందుకు వీలుగా నామమాత్రంగా రెండు రూపాయలకే మాస్క్ అందించేందుకు హుబ్లీ ధార్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది. హుబ్లీ నగరంలోని ప్రధాన మార్కెట్లు, బస్ టెర్మినళ్లు, కార్పొరేషన్ కార్యాలయాలు, కిమ్స్ ఆసుపత్రుల ఆవరణల్లో ప్రజలకు మాస్కులు అందించేందుకు మాస్క్ వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా మాస్కులు ధరించడం తప్పనిసరి అని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మాస్క్ ధరించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. సామాన్యులు, పేదలకు మాస్కులను కేవలం రెండు రూపాయలకే అందించేలా ఆటోమేటిక్ మాస్క్ వెండింగ్ యంత్రాలను ఏర్పాటు చేశామని హుబ్లీ థార్వాడ్ మున్సిపల్ కమిషనర్ సురేష్ చెప్పారు. రెండు రూపాయల నాణాన్ని ఆటోమేటిక్ మాస్కు వెండింగ్ మిషన్ లో వేస్తే చాలు ఒక సర్జికల్ మాస్కు అందిస్తోంది. ఒక్కో యంత్రంలో 100 మాస్కులు లోడ్ చేసి అవి కనిపించేలా డిస్ ప్లే చేశారు. యంగ్ ఇండియన్స్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో తాము ఏర్పాటు చేసిన యంత్రాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని కమిషనర్ సురేష్ చెప్పారు.