Venkaiha Naidu farewell: వెంకయ్య చమత్కారాలపై మోదీ ప్రశంసలు
ABN , First Publish Date - 2022-08-08T19:37:56+05:30 IST
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు...
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M.Venkaiah Naidu)పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) ప్రశంసలు కురిపించారు. వెంకయ్యనాయుడి చమత్కారాలే (Wit) ఆయన విజయ రహస్యాలని అన్నారు. ఈనెల 10వ తేదీతో వెంకయ్యనాయుడు పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో సోమవారంనాడు వీడ్కోలు సమావేశం (Farewell function) జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్గా వెంకయ్యనాయుడు ఐదేళ్ల పదవీకాలంలో సభాసమయం వినియోగం 70 శాతానికి పైగా పెరిగిందని ప్రశంసించారు. చర్చలను ఎప్పుడూ ఆయన ప్రోత్సహించేవారని, ఆయన నెలకొల్పిన ప్రమాణాలు ఆ తర్వాత వచ్చే వారికి కూడా మార్గదర్శకాలవుతాయని అన్నారు.
ఒక దశ దాటి సభా కార్యక్రమాల నిర్వహణకు అంతరాయం ఏర్పడితేనే సభా ఉల్లంఘన కింద వెంకయ్యనాయుడు తీసుకునేవారని అన్నారు. భాష పట్ల ఆయనకున్న ఆరాధనా భావం కూడా ప్రశంసనీయమని, సభాకార్యక్రమాల నిర్వహణలో ఈ విషయం ప్రస్ఫుటంగా కనిపించేదని అన్నారు. చైర్మన్గా మాతృభాషను ఆయన ప్రోత్సహించేవారన్నారు. వెంకయ్యనాయుడు చమత్కారాలతో ఆకట్టుకునే వారని, అవన్నీ విట్ లైనర్స్ అని, నాయుడు ఏమి చెప్పినా అవన్నీ చాలా లోతుగా అర్ధవంతంగా ఉండేవని ప్రశంసించారు. ఏ పదవి చేపట్టినా దానిని సమర్ధవంతంగా ఆయన నిర్వహించే వారని, ఉపరాష్ట్రపతిగా ఎక్కువ సమయాన్ని ఆయన యువజన సంక్షేమానికి పనిచేశారని కొనియాడారు.