వేసవి చోరీలతో జరభద్రం

ABN , First Publish Date - 2021-05-11T03:48:11+05:30 IST

: వేసవిలో చోరీలు అధికమవుతాయి. కుటుంబాలు, ఇల్లు వదిలి ఊరెళ్లడం, ఆరుబయట నిద్రపోవడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.

వేసవి చోరీలతో జరభద్రం
సీఐ గంగాధర్‌రావు

పొదలకూరు, మే 10 : వేసవిలో చోరీలు అధికమవుతాయి. కుటుంబాలు, ఇల్లు వదిలి ఊరెళ్లడం, ఆరుబయట నిద్రపోవడం వంటివి ఇందుకు దోహదం చేస్తాయి. ఇటీవల పట్టణంలో ఓ వలంటీర్‌ బైక్‌ చోరీ ఘటనే ఇందుకు ఉదాహరణ. చోరీల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వేసవిలో స్థానికంగా ఉండే చోరులతోపాటు ఇతరప్రాంతాలకు చెందిన నేరగాళ్లు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారూ నేరాలకు పాల్పడుతున్నారు. ఇటీవల చోరీలు, ఇతర నేరాల్లో యువత, విద్యార్థులు ఉండం గమనార్హం. 


 రెక్కీ వేసి మరీ దొంగతనాలు


బూరలు, పిన్నీసులు, జడ వెంట్రుకలు, సవరాలు విక్రయించే వారిలా మహిళలు వీధుల్లో పగలు రెక్కీ నిర్వహిస్తారు. తాళాలు వేసిన ఇళ్లను నిశితంగా పరిశీలిస్తారు. ఆయా ఇళ్ల ముందు ముగ్గులు వేసి రోజులు గడుస్తున్నా రాత్రివేళల్లో ఇళ్లల్లో దీపాలు వెలగకపోయినా, ఇంటి వరండాలో దినపత్రికలు రోజులు తరబడి తీయకుండా ఉన్నా, అందులోని యజమానులు లేరని పసిగడతారు, రాత్రి వేళల్లో ఆ ఇళ్లల్లో ఆ చోరీలకు పాల్పడతారు. ఆ సమయంలో పోలీసులు అటుగా వస్తుంటే గుర్తించి లోపలకు వెళ్లిన మగవాళ్లకు బయట నక్కి ఉన్న మహిళలు పిల్లికూతలు, కుక్క అరుపులతో సంకేతాలు పంపిస్తుంటారు. 


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 


ఇళ్లల్లో బంగారం, వెండి,ఇతర  విలువైన వస్తువులు పెద్ద మొత్తంలో నగదు ఉంచుకోకుండా బ్యాంక్‌లో భద్రపరచుకోవాలి. అలా కుదరకుంటే బీరువాలో కాకుండా ఇతర సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలి, వేసవి సెలవులకు ఊరు వెళితే ఆ ఇంటిలో రాత్రి వేళల్లో లైట్లు వెలిగేలా చూసుకోవాలి. 

- సీఐ గంగాధర్‌రావు 


Updated Date - 2021-05-11T03:48:11+05:30 IST