పప్పుల చీటీల వ్యాపారి ఇంటిని చుట్టుముట్టిన బాధితులు
ABN , First Publish Date - 2022-01-22T06:04:55+05:30 IST
మండలంలోని పాములవాకలో పప్పుల చీటీల వ్యాపారి ఇంటిని శుక్రవారం బాధితులు చుట్టుముట్టారు. ఈ వ్యాపారి మోసాలపై ఈనెల 13న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. గ్రామానికిచెందిన కేతవరపు సత్యనారాయణ (చిట్టిబాబు) సంక్రాంతి పండగకు 25 రకాల సరుకులు, నూనె డబ్బా సరఫరా చేస్తామంటూ పప్పులచీటీలు పేరుతో ఒక్కొక్కరి నుంచి నెలకు రూ. 300 చొప్పున వసూలు చేశాడు.
మాజీ సర్పంచ్ ఎదుట పంచాయితీ
వారంలో డబ్బు చెల్లింపునకు అంగీకారం
కోటవురట్ల, జనవరి 21: మండలంలోని పాములవాకలో పప్పుల చీటీల వ్యాపారి ఇంటిని శుక్రవారం బాధితులు చుట్టుముట్టారు. ఈ వ్యాపారి మోసాలపై ఈనెల 13న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. గ్రామానికిచెందిన కేతవరపు సత్యనారాయణ (చిట్టిబాబు) సంక్రాంతి పండగకు 25 రకాల సరుకులు, నూనె డబ్బా సరఫరా చేస్తామంటూ పప్పులచీటీలు పేరుతో ఒక్కొక్కరి నుంచి నెలకు రూ. 300 చొప్పున వసూలు చేశాడు. కోటవురట్ల, నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం, మాకరపాలెం మండలాల్లో సుమారు 4000 మంది డబ్బు చెల్లించారు. తీరా పండగ సమీపిస్తున్న తరుణంలో వ్యాపారి పరారై విజయవాడలో తలదాచుకున్నాడు. తిరిగి శుక్రవారం స్వగ్రామం చేరుకున్నాడు. దీంతో వందిలాది మంది బాధితులు వ్యాపారి ఇంటిని చుట్టుముట్టారు. వ్యాపారిని రామాలయం వద్దకు తీసుకువచ్చి మాజీ సర్పంచ్ కిల్లాడ శ్రీనివాసరావు ముందు పంచాయితీ పెట్టారు. ఈ సందర్బంగా వ్యాపారి సత్యనారాయణ మాట్లాడుతూ పప్పుల చీటీల పేరుతో 4 వేల మంది నుంచి రూ.3 వేల చొప్పున వసూలు చేశానని, 2,500 మందికి సరకులు పంపిణీ చేశానని, మరో 1,500 మందికి నగదు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.
తనకు వేములపూడిలో 30 సెంట్ల స్థలం ఉందని, దానిని విక్రయించి, డబ్బు చెల్లిస్తానని పంచాయితీలో అంగీకరించాడు. ఇందుకోసం రెండువారాల గడువు కావాలని కోరడంతో బాధితులు అంగీకరించలేదు. అయితే మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు జోక్యంచేసుకుని వారం రోజులు గడువు ఇచ్చారు. సమయానికి డబ్బు చెల్లించకుంటే పోలీసు కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో బాధితులు శాంతించారు.