చదువును మించిన ఆస్తి లేదు..
ABN , First Publish Date - 2022-07-06T06:43:59+05:30 IST
చదువును మించిన ఆస్తి లేదని..కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు.
విద్యాకానుక కిట్ల పంపిణీలో హోం మంత్రి వనిత
కొవ్వూరు, జూలై 5: చదువును మించిన ఆస్తి లేదని..కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. కొవ్వూరు మండలం పంగిడి జడ్పీ హైస్కూల్లో మంగళవారం జిల్లాస్థాయి విద్యాకానుక కిట్లు పంపిణీ చేశారు. మేందుగా నాడు నేడు పఽథకంలో భాగంగా పాఠశాలల్లో రూ.1.75 కోట్లతో చేపట్టనున్న 15 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ పిల్లలకు విద్య నేర్పించడంలో తల్లిదండ్రులు ఆడ, మగ వ్యత్యాసం చూపించడం తగదన్నారు. ఇద్దరిని సమానంగా చూసి చిన్నతనం నుంచే ఉన్నత విలువలు, లక్ష్య చేదన దిశగా ప్రోత్సాహిస్తే తప్పక విజయం సాధిస్తారన్నారు. ప్రతి విజయంలో 99 శాతం కష్టం, 1 శాతం మాత్రమే అదృ ష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. డీఈవో ఎస్.అబ్రహాం మాట్లాడుతూ జిల్లాలోని 19 మండలాల్లోని 1007 పాఠశాలల్లో 1,53,706 మంది విద్యార్థులకు ఒక్కొక్కటి రూ.1545లు విలువైన విద్యాకానుక కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. నాడు నేడు పథకంలో 546 పాఠశాలల్లో రూ.162 కోట్లు వెచ్చించి.. పాఠశాలల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేని మండలాల్లో 17 జూనియర్ కళాశాలలను ప్రారంభిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఎస్. మల్లిబాబు, ఎంఈవో జె.కెంపురత్నం, డ్వామా పీడీ పి.జగదాంబ, సర్పంచ్ గోశా ల నాగార్జున, ఎంపీపీ కాకర్ల నారాయుడు, వైస్ ఎంపీపీ వీరమళ్ల నారాయుడు, బండి పట్టాభిరామారావు,తహశీల్దార్ నాగరాజ నాయక్ పాల్గొన్నారు.
పాఠశాలకు అరకొరగా విద్యా కానుక కిట్లు..
తాళ్లపూడి/కోరుకొండ, జూలై 5 : తొలిరోజు ఆర్భాటమే తప్ప.. విద్యాకానుక కిట్లు పాఠశాలలకు అందలేదు.జగనన్న విద్యా కానుక కిట్లు మండల కేంద్రా లకు అరకొరగా రావడంతో పంపిణీ చేయడానికి ఉపాధాయులు తలలు పట్టుకుంటున్నారు. తాళ్లపూడి, కోరుకొండ మండల కేంద్రాలకు బూట్లు, సాక్సులు, టైలు బెల్టులు ఇంకా కార్యాలయానికి చేరలేదు. పూర్తి స్థాయిలో పాఠ్యాంశాలు, యూనిఫాంలు చేరలేదు. కేవలం స్కూల్ బ్యాగ్లు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం పాఠ్యపుస్తకాలు కూడా పాఠశాల ప్రారంభం రోజున ఇవ్వలేదు.బ్యాగులు నాణ్యత లేకపోవడంతో బుక్స్ పెడితే ఒక్కరోజులోనే చిరి గిపోతాయన్న అనుమానంతో కోరుకొండ మండలానికి వచ్చిన బ్యాగులను వెనక్కి పంపించారని అవి ఎప్పుడు వస్తాయో తెలియదన్నారు.