అవసరానికి మించి బెడ్లను ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2021-04-18T04:56:19+05:30 IST
కొవిడ్ ఆసుపత్రులల్లో అవసరానికి మించి అదనంగా బెడ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు.
- వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్
- ఆసుపత్రుల్లో ఏర్పాట్లను వివరించిన కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు(కలెక్టరేట్), ఏప్రిల్ 17: కొవిడ్ ఆసుపత్రులల్లో అవసరానికి మించి అదనంగా బెడ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి ప్రిపేర్డ్నెస్ ఆఫ్ కొవిడ్ హాస్పిటల్స్, కొవిడ్ కేర్ సెంటర్స్, కొవిడ్ వ్యాక్సినేషన్, కొవిడ్ వైద్యానికి సంబంధించిన మందుల సరఫరా తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జేసీలతో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కొవిడ్ కేర్ సెంటర్లులో మౌలిక వసతులతో పాటు కనీసం వెయ్యి పడకలు యుద్ధ పాతిపదికన సిద్ధం చేయాలని ఆదేశించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పారిశుధ్యంపైన ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనంతరం జిల్లాల వారీగా కొవిడ్ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో వసతులు, ఇప్పటివరకు జరిగిన వ్యాక్సినేషన్ వివరాలు, 104 వాహనాల లభ్యత, 104, 1092 కాల్ సెంటర్ సర్వీసుల పని తీరుపై సమీక్షించారు.
అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్
కలెక్టర్ వీర పాండియన్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని కొవిడ్ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ సెంటర్లలో ఎలాంటి కొరత లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని వివరించారు. జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో, కేర్ సెంటర్లలో ముందస్తు జాగ్రత్తగా అదనంగా బెడ్లను అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చామని తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్పై ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించేలా అవగాహన కల్పిస్తున్నామని ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి వివరించారు. కర్నూలు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ వీర పాండియన్తో పాటు జాయింట్ కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజి, డిస్ర్టిక్ట్ కొవిడ్ కోఆర్డినేషన్ ఆఫీసర్ డీఆర్డీఏ పీడీ శ్రీనివాసులు, డీఎంహెచ్వో డా.రామగిడ్డయ్య, డీఐవో డా.విశ్వేశ్వరరెడ్డి, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.