సింహగిరిపై విజిలెన్స్‌ తనిఖీలు

ABN , First Publish Date - 2022-07-01T06:25:57+05:30 IST

సింహగిరిపై దుకాణాల్లో విజిలెన్స్‌, తూనికలు కొలతల శాఖల అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

సింహగిరిపై విజిలెన్స్‌ తనిఖీలు
దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్న అధికారులు

ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయం

కొండపై 11, దిగువన ఆరు దుకాణాలపై కేసుల నమోదు

సింహాచలం, జూన్‌ 30: సింహగిరిపై దుకాణాల్లో విజిలెన్స్‌, తూనికలు కొలతల శాఖల అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సాధారణ వినియోగదారులు వలే గురువారం ఉదయం తొలుత కొండ దిగువన, తర్వాత సింహగిరిపై దేవస్థానం దుకాణా సముదాయాలలో అధికారులు సిబ్బందితో కలిసి డ్రింక్‌లు కొనుగోలు చేశారు. వాటికి ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేశారు. పలువురు వ్యాపారులు బాటిల్స్‌పై ఉన్న ధరల కంటే అఽధిక మొత్తానికి విక్రయిస్తున్నారని నిర్ధారించుకున్నారు. దీంతో కొండదిగువన ఆరు, సింహగిరిపై 11 దుకాణాల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.


ఈ సందర్భంగా విజిలెన్స్‌ డీఎస్పీ అన్నెపు నరసింహమూర్తి విలేఖరులతో మాట్లాడుతూ వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తుల నుంచి తరచూ వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు  వస్తువులు ముఖ్యంగా కూల్‌ డ్రింక్స్‌ విక్రయిస్తున్నట్లు రుజువు కావడంతో కేసులు నమోదుచేశామని చెప్పారు.


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏయే దుకాణానికి ఎంత జరిమానా విధించాలన్నది నిర్ణయిస్తామని తెలిపారు. తనిఖీలలో తూనికలు కొలతల శాఖ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ బి రమాచంద్రయ్య, ఇన్‌స్పెక్టర్‌ ఉమాసుందరి, కానిస్టేబుల్‌ గంగాధర్‌, సింహాచల దేవస్థానం ఏఈఓ కె.రాజేంద్రకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:25:57+05:30 IST