ఓగీపూర్ నాపరాతి గనుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2021-06-23T05:06:06+05:30 IST
ఓగీపూర్ నాపరాతి గనుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
తాండూరు రూరల్: తెలంగాణ-కర్ణాటక సరిహద్దులోని కరన్కోట్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ సర్వేనెంబర్-129లో రాష్ట్ర మైన్స్ శాఖ విజిలెన్స్ అధికారుల బృందం మంగళవారం తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ మహేశ్ ఆధ్వర్యంలో తాండూరు రెవెన్యూ శాఖ ఆర్ఐ రాజిరెడ్డి మైన్స్ శాఖ ఆర్ఐ రమే్షతో కలిసి విజిలెన్స్ అధికారులు నాపరాతి గనుల్లో పలు సర్వీస్ కనెక్షన్లను పరిశీలించారు. సర్వీస్ కనెక్షన్ నెంబ ర్-155, 169, 180 సర్వీస్ కనెక్షన్లలో ఎవరి పేరిట కేటాయించారు, ప్రస్తుతం కొనసాగుతున్నాయా? తొలగించబడ్డాయా? గతంలో ఈ సర్వీస్ కనెక్షన్ల ద్వారా ఎంతమేరకు తవ్వకాలు చేపట్టారు? అనే విషయాలపై విద్యుత్శాఖ అధికారులను అడిగి సమగ్ర వివరాలు సేకరించారు. ఓగీపూర్ నాపరాతి గనుల్లో ఏ మేరకు తవ్వకాలు జరుపుతున్నారో తవ్వకాలు జరిపే వారు లీజులు పొంది జరుపుతున్నారా? అక్రమ తవ్వకాలు జరుపుతున్నారా? అనే విషయాలపై పూర్తిస్థాయిలో రెవెన్యూ, మైన్స్, విద్యుత్శాఖ అధికారులను అడిగి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు పలు రికార్డులను పరిశీలించారు. అధికారుల వెంట విద్యుత్, మైన్స్, రెవెన్యూ అధికారులున్నారు.
అధికారుల తనిఖీలతో అక్రమార్కుల హడల్
విజిలెన్స్ అధికారులు తనిఖీకి వస్తున్నట్లు రెండు,మూడురోజుల ముందుగానే తెలియడంతో కొందరు అక్రమ తవ్వకందారులు పనులు నిలిపివేసి కట్టింగ్ మిషన్లను తరలించారు. మరికొందరు విజిలెన్స్ అధికారులు వచ్చారని తెలుసుకుని కట్టింగ్మిషన్ను జేసీబీ బకెట్లో పెట్టి దొంగచాటుగా తరలించారు. మండల పరిధిలోని ఓగీపూర్ నాపరాతి గనుల్లో జరుగుతున్న అక్రమాలను విజిలెన్స్ అధికారులు వచ్చి తెలుసుకునే లోపే కొందరు నాపరాతిగనుల యజమానులు అలర్ట్గా ఉంటూ పనులు నిలిపివేస్తున్నట్లు సమాచారం. కాగా ఆకస్మిక తనిఖీలు చేపడితే 129 సరే ్వనెంబర్లో అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని పలువురు అంటున్నారు.