కిరాణా షాపులపై విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2022-07-01T06:11:50+05:30 IST
పాడేరులోని కిరాణా షాపులపై గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు చేశారు.
10 మంది వ్యాపారులపై కేసులు నమోదు
పాడేరురూరల్, జూన్ 30: పాడేరులోని కిరాణా షాపులపై గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు చేశారు. 10 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. మోదకొండమ్మ ఆలయ పరిసరాల్లో కిరాణా తదితర వ్యాపారాలను సాగించే వర్తకులు ఎంఆర్పీ ధరల కంటే అధికంగా సరకులు విక్రయిస్తున్నట్టు అందిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. విజిలెన్స్ ఎస్పీ జి.స్వరూపరాణి ఆదేశాల మేరకు అధికారులు డి.రవికుమార్, ఆర్.జగన్మోహనరావుల బృందం ఈ దాడులు చేశాయి. వివిధ రకాల సామగ్రిని ఎంఆర్పీ ధరల కంటే అధికంగా విక్రయిస్తున్నట్టు గుర్తించి 10 మంది వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వినియోగదారులను మోసగించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. పాడేరులో వర్తకులు ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం అందితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సిబ్బందితో పాటు తూనికలు కొలతల శాఖ అధికారిణి అనురాధ పాల్గొన్నారు.