డీఎస్టీ-ఎస్టీఐ హబ్ ప్రాజెక్టు
ABN , First Publish Date - 2021-12-06T05:54:22+05:30 IST
వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నుంచి మంజూరైన డీఎస్టీ-ఎస్టీఐ హబ్ ప్రాజెక్టు పనులను ఆదివారం క్రోసూరు మార్కెట్ యార్డులో ఐసీఏఆర్ ప్రిన్సిపాల్ సైంటిస్టు డాక్టర్ ఓఎన్ తివారీ ప్రారంభించారు.
క్రోసూరు, డిసెంబరు 5: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ నుంచి మంజూరైన డీఎస్టీ-ఎస్టీఐ హబ్ ప్రాజెక్టు పనులను ఆదివారం క్రోసూరు మార్కెట్ యార్డులో ఐసీఏఆర్ ప్రిన్సిపాల్ సైంటిస్టు డాక్టర్ ఓఎన్ తివారీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని డీఎస్టీ - ఎస్టీఐ హబ్ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలోని షెడ్యూల్ కులాల ప్రజల ఆదాయాభివృద్ధి, జీవనోపాధి మెరుగుదల కోసం ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్రోసూరు పరిసర ప్రాంతాల్లో ప్రజలకు సాంకేతికతను అలవాటు చేయడంతో పాటు ఔషద సుగంధ మొక్కల పెంపకం, పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని క్రోసూరు, సత్తెనపల్లి, చేబ్రోలు మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కేవీ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతాంగానికి ఎంతో మేలు చేసేదిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ వెంపా జాలయ్య, అనుముల శ్రీనివాసరెడ్డి, క్రోసూరు ఎంపీపీ పెరుమాళ్ళపల్లి కోటయ్య, వైసీపీ నాయకులు షేక్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.