Vijayasahnathi : కేసీఆర్ జ్ఞాపకశక్తిని కోల్పోయి, మళ్లీ మళ్లీ పర్యటిస్తున్నారు
ABN , First Publish Date - 2021-08-05T03:23:43+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారి వందలాది కుటుంబాలను కలవడానికి 7 సంవత్సరాలుగా
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారి వందలాది కుటుంబాలను కలవడానికి 7 సంవత్సరాలుగా ఈ ముఖ్యమంత్రి గారికి ఒక్క రోజు కూడా దొరకలేదని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఎద్దేవా చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న వేలాది రైతుల, నిరుద్యోగుల కుటుంబాలను చూడడానికి ఒక్క రోజుకూడా దొరకదని మండిపడ్డారు. ఏవో రెండు మూడు గ్రామాలను దత్తత తీసుకున్నానని చెబుతూ నెలకు రెండు సార్లు వెళ్ళిన చోటికే మళ్లీ మళ్లీ పర్యటనలు చేస్తూ, ఆ ఊర్లకే మొత్తం అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నారని అన్నారు. ఈ తీరేందో తెలంగాణ మొత్తానికి తెలియడం లేదని చురకలంటించారు. ఈ సీఎం గారు జ్ఞాపకశక్తి కోల్పోయి, చేసిన పర్యటనలే మళ్లీ, మళ్లీ చేస్తున్నారా?.. లేక హుజురాబాద్ ఎన్నికల దృష్ట్యా గత హామీలను అమలు చేస్తానని చూపడానికి, కొత్త మోసాల హామీలతో ఓటర్లను బోల్తా కొట్టించడానికి ఈ కార్యక్రమం నడుపుతున్నారా? అని విజయశాంతి తీవ్రంగా ఫైర్ అయ్యారు.