vijayashanthi : జయశంకర్ సార్ బతికుంటే.. కుమిలి కుమిలి ఏడ్చేవారు

ABN , First Publish Date - 2021-08-06T21:19:45+05:30 IST

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికుంటే... నేటి తెలంగాణ స్థితిని చూసి, తీవ్రంగా బాధపడేవారని బీజేపీ సీనియర్

vijayashanthi : జయశంకర్ సార్ బతికుంటే.. కుమిలి కుమిలి ఏడ్చేవారు

హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ బతికుంటే... నేటి తెలంగాణ స్థితిని చూసి, తీవ్రంగా బాధపడేవారని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. ఇప్పటి పరిస్థితిని చూసి, ఇందుకా తెలంగాణ సాధించింది? అని తీవ్రంగా బాధపడేవారని పేర్కొన్నారు. మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాల్ని పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారని, వారి ఆశయాలకు ఈ సర్కారు ఏ కాస్తయినా విలువనిచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. మన నీరు దోపిడీకి గురవుతుంటే తెలంగాణ సర్కారు చోద్యం చూస్తూ కూర్చుందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేనాటికి దేశంలోనే మనది ధనిక రాష్ట్రమని చెప్పి నేడు అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు నిధులివ్వలేక... పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అంతా అస్తవ్యస్తంగా మార్చేశారని విజయశాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై విజయశాంతి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. పోస్టును యథాతథంగా..




ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసి, మలిదశ ఉద్యమానికి ప్రాణమై నిలిచిన జయశంకర్ సార్ బతికుంటే... తెలంగాణలో నేడున్న పరిస్థితి చూసి ఇందుకేనా రాష్ట్రాన్ని సాధించుకుందని ఆయన కంట కన్నీరు ఏరులై పారేది. మన భూమి, మన ఉద్యోగాలు, మన నీరు మనకే కావాలని ఎందరో ఉద్యమకారులు కుటుంబాల్ని పణంగా పెట్టి బలిదానాలతో అమరులయ్యారు. వారి ఆశయాలకు ఈ సర్కారు ఏ కాస్తయినా విలువనిచ్చిందా? మన నీరు దోపిడీకి గురవుతుంటే తెలంగాణ సర్కారు చోద్యం చూస్తూ కూర్చుంది. నకిలీ విత్తనాలు, ఎరువుల కొరతను ఎదుర్కుని అన్నదాతలు పంటలు పండిస్తుంటే... మద్దతు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు ఉండవు. చివరకు గతిలేక తమ పంటలకు తామే మంట పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇక సర్కారు కొలువుల కోసం గత ఏడేళ్ళలో జరిగిన ఆత్మహత్యల గురించి తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతోంది. లక్షల సంఖ్యలో ఖాళీలున్నా భర్తీ చెయ్యడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేనాటికి దేశంలోనే మనది ధనిక రాష్ట్రమని చెప్పి నేడు అప్పుల కుప్పగా మార్చేశారు. అభివృద్ధి పనులకు నిధులివ్వలేక... పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక అంతా అస్తవ్యస్తంగా మార్చేశారు. రాష్ట్రంలోని నగరాల్ని డల్లాస్, ఇస్తాంబుల్, లండన్ లాగా ఇంకేవేవో చేసేస్తామన్నారు... తీరా చూస్తే వాన చినుకు పడితే చాలు కాలనీలకు కాలనీలే నెలల తరబడి నీట మునిగే పరిస్థితి. ఇక కోవిడ్ విషయానికొస్తే కార్పోరేట్ల దోపిడీని నిలువరించలేక ప్రజారోగ్యాన్ని అభద్రతలోకి నెట్టేశారు. ఇదేనా జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ?... ఇది అధికార పార్టీకి మాత్రమే బంగారు తెలంగాణ తప్ప, ప్రజలకు కాదు. సార్ మన మధ్య ఉంటే, ఈ పాలకుల్ని గద్దె దించేందుకు కచ్చితంగా మరో ఉద్యమానికి ఊపిరులూదేవారు.

Updated Date - 2021-08-06T21:19:45+05:30 IST