విజయోస్తు...ఆరోగ్యమస్తు !!
ABN , First Publish Date - 2020-10-25T06:50:39+05:30 IST
మహా గౌరి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపిణి అయిన జగన్మాత దైత్య సంహారం చేసి విజయదుర్గగా అవతరించిన పర్వడియే విజయదశమి.
నేడు విజయదశమి
జగన్మాత ఆరాధనలో భక్తులు
నెల్లూరు (సాంస్కృతికం), అక్టోబరు 24 :
మహా గౌరి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపిణి అయిన జగన్మాత దైత్య సంహారం చేసి విజయదుర్గగా అవతరించిన పర్వడియే విజయదశమి. దుష్ట సంహారానికి, ఆర్తజన రక్షణకు ప్రతీకగా ఈ పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ యేడాది యావత్ ప్రపంచానికి శత్రువుగా పరిణమించిన కరోనా మహమ్మారిని అతి త్వరగా అంతమొందించి అందరికీ ఆరోగ్యాన్ని, విజయాన్ని ప్రసాదించాలంటూ భక్తులు ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజులుగా విశేష పూజలు, అభిషేకాలు హోమాలు, అలంకరణలు జరుగుతున్న ఆలయాల్లో విజయదశమి సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు, పూలంగి సేవలు జరగనున్నాయి. ఇళ్లలో దసరా పండుగకు ప్రజలు నూతన వస్త్రాలు, వస్తుసామగ్రి కొనుగోళ్లకు రావడంతో బజార్లు సందడిగా మారాయి. వాహన, ఆయుధ పూజకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పండ్లు, పూలు, బొరుగులు, బెల్లం, కొబ్బరి కాయలు, గుమ్మడికాయల ధరలు ఆకాశాన్నంటాయి. కాగా, గతేడాది వరకు దసరా 10 రోజులు సంబరాలు జరుపుకునే ప్రజలు ఈ ఏడాది కరోనా కాటుతో, ప్రభుత్వాల సూచనలతో సాదాసీదాగా జరుపుకుంటున్నారు. ఫలితంగా వ్యాపారాలు కూడా గణనీయంగా పడిపోయాయి.
ప్రముఖుల శుభాకాంక్షలు
జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రులు అనిల్కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, శాసన సభ్యులు వేర్వేరు ప్రకటనల్లో దసరా శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ వీ చక్రధర్బాబు, ఎస్పీ భాస్కర్భూషణ్, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్ తదితరులు కూడా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.